వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నాణ్యతతో కూడిన ఆయిల్ను పంపిణీ చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో విజయ ఆయిల్కు అధిక డిమాండ్ ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ శివరాంపల్లి ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ మేనేజర్ కె.వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రతినెల 30వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ ప్యాకింగ్ జరుగుతున్నా.. కొరతగానే ఉంటుందని తెలిపారు. వంట నూనెలను (నువ్వులు, కొబ్బరి , రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్ , రిఫైండ్ సన్ప్లవర్ ఆయిల్, ఆర్బీడీ ఫామోలిన్ ఆయిల్, డబుల్ ఫిల్టర్ వేరుశనగ నూనె, రిఫైండ్ వెజిటేబుల్, కుకింగ్ ఆయిల్) వినియోగ దారులకు సరసమైన ధరలకే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వినియోగించడంతో పాటు రేషన్ దుఖాణాల్లో సైతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
సమైఖ్య పాలనలో హైదరాబాద్ సమీపంలో వెలిసిన పలు నూనె తయారీ పరిశ్రమలు నాణ్యత లేని వంట నూనెలను సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. ఇతర ప్రాంతాల వారు అధిక మొత్తంలో విజయ హైదరాబాద్ వంట నూనెలను వినియోగిస్తుండటంతో డిమాండ్ పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయ ఆయిల్పై అవగాహన లేక ఇతర ప్రాంతాల నూనెలు వాడుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుండటంతో నూనెల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. విజయ ఆయిల్ లీటర్ నుంచి 15 లీటర్ల వరకు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారన్నారు. ఇతర ప్రైవేటు నూనెలు వాడి ప్రజలు అనారోగ్యాల బారిన పడవద్దని, విజయ ఆయిల్ వినియోగించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.