శంషాబాద్, సెప్టెంబర్ 7: కరోనా థర్డ్ వేవ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో మంగళవారం ఉచిత టీకా కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉషమ్మ దంపతులు ప్రారంభించారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని 3 కేంద్రాలను ( హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ) కూడా ఏకకాలంలో వారు ప్రారంభించారు. సుమారు 5,000 మందికి టీకాలు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కరోనాతో సాగుతున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని సూచించారు. గత ఆగస్టు వరకు దేశంలో 50 శాతం టీకాలను పూర్తిచేయడం ఎంతో గర్వకారణమన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ప్రభుత్వాలు, నిపుణుల ఇస్తున్న సూచనలు తప్పక పాటించాలన్నారు.
టీకా కార్యక్రమాన్ని నిర్వహించిన స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకులు, భారత్ బయోటిక్, ముప్పవరపు ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ (హైదరాబాద్), సింహపురి వైద్య సేవా సమితి, పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్స్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర, స్వర్ణ భారత్ ట్రస్టు చైర్మన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ భద్రారెడ్డి, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేశ్ కుమార్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటం శ్రీధర్రెడ్డి, వల్లభనేని వంశీ, నెల్లూరు కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, స్వర్ణభారత్ ట్రస్టి దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టి ముప్పవరపు హర్షవర్ధన్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు.