మియాపూర్, అక్టోబర్ 7: కరోనా సమయంలో వందలాది మంది నిరుపేదలకు వైద్య, నిత్యావసర సరుకుల పంపిణీ చేసినందుకు గాను మాజీ మంత్రి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి సుముద్రాల వేణుగోపాలాచారిని అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డు వరించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధిగా ఉండి ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని విమానాల ద్వారా సొంత ఊళ్లకు వెళ్లేందుకు తోడ్పాటును అందించినందుకు గాను చారికి అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డును అందించారు. సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు ఈ అంతర్జాతీయ అవార్డును వేణుగోపాలచారికి జాతీయ అవార్డును లయన్స్ క్లబ్ అధ్యక్షులు అన్నం వేణుగోపాల్ రావులకు అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాలచారి మాట్లాడుతూ ఆయా రంగాల్లో సేవలను అందిస్తున్న వారిని మరింతగా సేవ వైపు ప్రోత్సహించేందుకు గాను విశ్వగురు సంస్థ అవార్డులను ప్రదానం చేయటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సంస్థ సలహాదారు యాదయ్య, హోలిస్టిక్ దవాఖాన చైర్మన్ డాక్టర్ రాంచంద్ర, డాక్టర్ రామ్ తిలక్, పోలీసు అధికారులు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, డాక్టర్ మదన్ మోహన్ పాల్గొన్నారు.