మారేడ్పల్లి, అక్టోబర్ 7: టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తూ…విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. గురువారం అమృతవాణి భవనంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల బహూకరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ….భావి భారతానికి ఉత్తమ పౌరులను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగం అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు ధీటుగా ఉన్నాయని…దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి దాని ద్వారా అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని కొనియాడారు.
ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులతో వారిని ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 44 మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, సంస్థ రాష్ట్ర కన్వీనర్ బిషప్ ఫమ్మి డేనియల్, రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్ కడారి, ఏపీ అధ్యక్షులు ఎలీషా కుమార్, అవార్డు కమిటీ కో ఆర్డినేటర్ గిడియోన్బాబు, ప్రతినిధులు వనిత అలెగ్జాండర్, శామ్యుల్ జాన్, జీకే బాబు, జాన్సుందర్రాజ్ పాల్గొన్నారు.