సిటీబ్యూరో, ఏప్రిల్ 27( నమస్తే తెలంగాణ ) : నగరంలో సోమవారం వాహనదారులను మళ్లీ ఇంధన కష్టాలు వెంటాడాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్ల్లో వాహనాలు కిలో మీటర్ల క్యూలో దర్శనమిచ్చాయి. ప్రధాన మార్గాల్లో ఉన్న బంక్ల ఎదుట వాహనాలు ఇంధనం కోసం వేచి ఉండటంతో గంటల తరబడి ట్రాఫిక్ జాం సమస్య తలెత్తింది. ముఖ్యంగా సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, దిల్షుక్గనర్, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, కార్వాన్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో చాలా బంక్లు నో స్టాక్ బోర్డులు పెట్టడం గమనార్హం. తెరిచి ఉన్న బంక్లు వాహనాల క్యూను తలపించాయి.
మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇంధనం సరిపడా ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు వాహనదారులు మాత్రం తమ వాహనాల్లో ఇంధనం ఫుల్ట్యాంక్ నింపుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇంధనం దొరకదేమోననే భయంతో అవసరానికి మించి పెట్రోల్ నింపుకొంటున్నారు. ‘రోజు రోజుకు ఇంధన సమస్య రెట్టింపు అవుతున్నది. మేం రోజూ పెట్రోల్ ఫిల్ చేయించుకునే బంక్ మూసి ఉంది. అందుకే మూడు కిలో మీటర్ల దూరమైనా మరో బంక్కు వచ్చి నింపుకొంటున్నాం.. చెప్పలేం ఎలాంటి పరిస్థితి వస్తుందోనని.
ముందే ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం బెటర్.’ అని రవి చెప్పాడు. ‘పూట గడవాలంటే ఆటో నడపాలి. అందుకోసం సీఎన్జీ ఉండాల్సిందే. ఇప్పుడు కొరత అంటున్నారు. అందుకే చార్మినార్లో సీఎన్జీ అయిపోవడంతో పంజాగుట్ట వరకు వచ్చాను.’ అని అలీ తెలిపాడు. కాగా, నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యలపై అధికారులు స్పందించి సరిపడా ఇంధనం ఉందని, వాహనదారులు హైరానా చెందొద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించాలనే బంక్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


