కొండాపూర్ : పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన‘ఆద్య కళా’ ప్రదర్శన అద్భుతంగా ఉందని ఎంఎల్సీ సురభి వాణిదేవి పేర్కొన్నారు. సోమవారం ఆమె మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆద్య కళా ప్రదర్శనను సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రదర్శనలోని ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు సాక్షాత్కారాలుగా ఉన్న పరికరాలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంతమవుతున్న ఆదివాసీల కళలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా దశబ్దాల పాటు శ్రమించి సేకరించిన ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావును అభినందించారు.
ప్రదర్శనలో ఉంచిన ప్రతీ వస్తువు దానికదే ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిపారు. పెయింటింగ్స్, పూజా సామాగ్రి, దేవతా మూర్తుల విగ్రహాలు, సంగీత వాయిద్య పరికరాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ, రౌనక్ యార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.