సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ నడువాల్సిన వందేభారత్ రైలును గురువారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వందేభారత్లో తలెత్తిన సాంకేతిక కారణం వల్ల దీనిని రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం దాని బదులుగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రత్యేక రైలు చార్జీలు మాత్రం వర్తిస్తాయని, వందేభారత్ టికెట్ చార్జీలను ప్రయాణికులకు తిరిగి ఇవ్వనున్నామన్నారు. ఈ నెల 18న కూడా వందేభారత్కు బదులుగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వన్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుందన్నారు.
11రైళ్లు దారి మళ్లింపు
సౌత్ ఈస్ట్రన్ రైల్వే హౌరా డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలోని 11 రైళ్లను దారి మళ్లిస్తూ గురువారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 5 వరకు టైమ్టేబుల్ వారీగా.. ఆయా రైళ్లను దారి మళ్లించినట్లు, పూర్తి వివరాలు రైల్వే వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్కు కొత్త స్టాపులు
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో యశ్వంత్పూర్ – నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలుకు మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో ఎక్స్పర్మెంటల్ స్టాపును ఏర్పాటు చేస్తూ గురువారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 నుంచి ఈ రెండు ఎక్స్పర్మెంటల్ స్టాపులు అమల్లో వస్తాయన్నారు.