ఉప్పల్/మల్కాజిగిరి జోన్ల బృందం, డిసెంబర్ 23 : ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గాల పరిధిలోని ఉప్పల్, రామంతాపూర్, నాచారం, చర్లపల్లి, కాప్రా, మల్కాజిగిరి, నేరేడ్మెట్, అల్వాల్, గౌతంనగర్, తదితర ప్రాం తాల్లోని వైష్ణవ ఆలయాలను భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తరద్వారం గుండా మహావిష్ణువును దర్శించుకు నేందుకు బారులుతీరారు.
చౌరస్తాలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేకువజామున 3గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకటరమణా చార్యులు, అర్చకులు తులసీ వెంకటరమణాచార్యులు శ్రీవారి ఆలయా నికి పక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి పూజల అనంతరం భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి అనుమతించారు.
కరిగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయం, రామంతాపూర్ కోదండ రామాలయం, రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కనుల పండుగగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాగిడి లక్ష్మారెడ్డి పూజలు నిర్వహించారు. అదేవిధంగా నాచారం హెచ్ఎంటీ నగర్లో కార్పొరేటర్ శాంతి పూజలు చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, ఆనంద్బాగ్లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ లో కార్పొరేటర్లు శ్రవణ్, క్యానం రాజ్యలక్ష్మి, అల్వాల్లో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, జితేంద్రనాథ్ పూజలు నిర్వహించారు.
ఓల్డ్కాప్రాలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో వేకువ జామున స్వామివారికి పల్లకీసేవ నిర్వహించిన అనంతరం ఆలయంలోని ఉత్తరద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాప్రా నేతాజీనగర్లోని శ్రీసీతారామంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.