హఠాత్తుగా వరదలు ముంచెత్తడంతో బెంబేలెత్తిన వైనం
సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగడంతో పలు పట్టణాలను వరదలు ముంచెత్తాయి. మంగళవారం పలు నదులతో పాటు నైనిటాల్ సరస్సు ఉప్పొంగడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి ఇండ్లు కూలిపోయాయి.
భారీ వరదల కారణంగా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందులో మన హైదరాబాదీలు ఐదుగురున్నారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, మల్కాజిగిరి ప్రాంతం రాధాకృష్ణానగర్కు చెందిన (ప్రసాద్ కుమార్తె) సుష్మ తన స్నేహితులు సూచి, హోలి, కృతి, శృతి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరంతా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. దసరా సెలవులను పురస్కరించుకొని చార్ధాం, బద్రీనాథ్ యాత్రలకు కోసం అక్కడికి చేరుకున్నారు. జిమ్ కార్బెట్ పార్కు పరిధిలోని లెమన్ ట్రీ రిసార్ట్ 3వ అంతస్తులో బస చేశారు. కుంభవృష్టి కురవడంతో వారున్న ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి.
రెండస్తుల మేరకు వరద ప్రవాహం కొనసాగినట్లు బాధితులు తెలిపారు. దీంతో ఇంటికి చేరుకుంటామో లేదో అనిపించిందని పేర్కొన్నారు. నాలుగు రోజులు వరదల్లో చిక్కుకోవడంతో భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. ఊహించని విధంగా వరదలు పోటెత్తడంతో ఏమి చేయాలో అర్థం కాలేదన్నారు. పరిస్థితిని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా చేరవేశారు. దీంతో తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ద్వారా విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి అక్కడి అధికారులతో మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదని వారందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అధికారులు వారిని న్యూఢిల్లీకి తరలించినట్లు తెలిపారు. అక్కడి నుంచి బుధవారం హైదరాబాద్కు రానున్నట్లు చెప్పారు. ఎట్టకేలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తిరిగి సురక్షితంగా ఢిల్లీకి చేరడంతో వారి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
వరదలు రావడంతో అక్కడున్న మూడంతస్తుల భవనంపైకి వెళ్లారు. రెండో అంతస్తు వరకు వరదలు రావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే సుష్మ మల్కాజిగిరిలోని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఆందోళనతో ఉన్న తండ్రి ప్రసాద్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్కు సమాచారం అందజేశారు. జగదీష్ గౌడ్ సమచారాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి పూర్తి వివరాలు తెలిపి సహాయ చర్యలు అందించాలని కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచాం ఇచ్చి, వెంటనే వరదలో చిక్కుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సురక్షితంగా రక్షించి వారు హైదరాబాద్కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. వెంటనే స్పందించిన ఉత్తరఖండ్ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో పాటు అక్కడి పోలీసుల సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విమానంలో పంపించనున్నారు.
‘విపరీతమైన వదలు ముంచెత్తాయి. ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. ఈ పరిస్థితుల్లో అసలు స్వస్థలానికి చేరుకుంటామా? అనే సందేహం కలిగింది. ఊహించని విధంగా వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వరదల ధాటికి ఎన్నో ఇండ్లు కొట్టుకుపోయాయని, తాము ఉన్న బంగ్లా పరిస్థితి ఏమిటి? అనే ఆందోళన మొదలైందన్నారు. దేవుడి దయవల్ల చివరికి వరద నుంచి క్షేమంగా బయటపడ్డాం’ అని సుష్మ అనే పర్యాటకురాలు తన అనుభవాలను వెల్లడించింది.