సిటీబ్యూరో, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని, ఇంటిల్లిపాది హాయిగా గడిపేందుకు ప్రభుత్వం ప్రకృతి వనాలను ఆధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నది. ఒకప్పుడు చెత్తాచెదారం, గుబురుపొదలతో ఉన్న వృథాగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు నేడు ప్రకృతి రమణీయతకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. అంతేకాదు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడంతోపాటు చిన్నారులు రోజంతా ఆడుకునేలా వివిధ పరికరాలను ఏర్పాటు చేస్తూ వారి ఆనందానికి అవధుల్లేకుండా చేస్తున్నారు. పక్షుల కిలకిలరావాలతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తున్నది.
ఇప్పటికే నగరంలో పలుచోట్ల అర్బన్ లంగ్ స్పేస్ పార్కులు ఉండగా, కూకట్పల్లి జోన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో దాదాపు 140 ఎకరాల విస్తీర్ణంలో ‘ప్రాణవాయు’ అర్బన్ ఫారెస్ట్ పార్కు అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నది. స్వచ్ఛమైన గాలి, ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడిపేలా, వాకర్స్కు అనువుగా ఈ పార్కులో చక్కటి సదుపాయాలు కల్పించారు. ప్రధానంగా కనువిందు చేసే జంతువుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్కసారిగా చూస్తే పులి, సింహం అక్కడ తచ్చాడుతున్నట్లు అనిపించే బొమ్మలు స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాయి.
ఎత్తయిన బండరాళ్లపై జంతువులు, ప్రకృతి సంబంధిత పెయింటింగ్స్ ఆహా అనిపిస్తాయి. పార్కు ప్రవేశద్వారం చూడముచ్చటగా డిజైన్తో తీర్చిదిద్దగా చూపరులను కట్టిపడేస్తుంది. సుమారు 140 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును జీహెచ్ఎంసీ, అటవీశాఖ సంయుక్తంగా తీర్చిదిద్దాయి. వాకింగ్ ట్రాక్, పండ్ల ఆకారంలో బెంచీలు, ఓపెన్క్లాస్ రూమ్, చక్కటి గార్డెనింగ్, మరుగుదొడ్లను పూర్తి చేస్తున్నారు. ఈ అందమైన పార్కును వచ్చేనెలలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని బల్దియా కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత తెలిపారు.
పార్కింగ్, ప్రవేశద్వారం, సెక్యూరిటీ గది, టికెట్ కౌంటర్, మూడు రెస్ట్రూంలు, గజీబో, వాటర్ఫాండ్, వాటర్ క్రాస్కెడ్, పికినిక్ ఏరియా, వెనుకగేటు సమీపంలో రెండు రెస్ట్ రూములు, నర్సరీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఔట్డోర్ నేచర్ క్లాస్, ఓపెన్క్లాస్ రూంలు, వాచ్టవర్, యోగా షెడ్, మరో రెస్ట్ రూం, బౌండరీ, పాత్వే, ఇంటర్నేషనల్ పాత్వేలు..ఇలా 21 రకాల ప్రత్యేకతలను పార్కులో సమకూర్చారు. దీని అభివృద్ధికి సుమారు రూ.16 కోట్ల మేర ఖర్చు చేశారు.