ఉప్పల్, నవంబర్ 21: శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కూచిపూడి నృత్యనీరాజనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కాచం సత్యనారాయణ, ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ పసుమర్తి శేషుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కళలకు, కళాకారుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిందన్నారు. కళాకారులను ప్రోత్సహిస్తూ, వారికి తగిన తోడ్పాటు అందించాలని సూచించారు. చిన్నారుల కళా నృత్యాలు అద్భుతమని కొనియాడారు. కార్యక్రమంలో నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
సీతనాగజ్యోతి శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచి పూడి నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాకారులు అభినయ, నాగజ్యోతి, శ్రీథనాయశర్మ, సాయి శిరీష, అపర్ణరెడ్డి, శ్రావ్య శేషాద్రి, చార్వి, మేఘ పాల్గొన్నారు. ఇందుమతి ఘంటి శిష్యబృందం ఆధ్వర్యంలో ఎందరో మహానుభావులు, రామ దాసు కీర్తన, హిమగిరి తనయ అంశాల్లో ప్రదర్శించారు. అనంతరం కళాకారులకు రమణిసిద్ధి సన్మానం చేశారు.