సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కోటిన్నర మంది ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే జలమండలి నిర్లక్ష్యానికి గురవుతున్నదని బీఆర్టీయూ నాయకులు అన్నారు. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం ఉద్యోగుల బదిలీలు, సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ధర్నా చేపట్టారు. ఉద్యోగుల డిమాండ్లతో పర్సనల్ డైరెక్టర్ ఖాదర్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలిని ఇష్టారీతిన విస్తరించిందని ఆరోపించారు.
పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచకుండా తలకు మించిన పనిభారాన్ని మోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక జేఈడీ, ముగ్గురు ఈడీలను మాత్రం అప్పటికప్పుడు నియమించి.. కిందిస్థాయి ఉద్యోగుల సంఖ్యను విస్మరించారని ఆరోపించారు. జలమండలిలో ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందిన వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారని.. దిగువ స్థాయి ఉద్యోగులు రిటైర్ అయితే మాత్రం ఆ స్థానంలో మరో ఉద్యోగికి అదనపు బాధ్యతలు కట్టబెడతూ వెట్టిచాకిరీ చేయిస్తునారని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో 6 వేలకు పైగా ఉన్న జలమండలి ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం సగాని కంటే తగ్గిందన్నారు. ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగుల సేవలను గుర్తించకుండా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 15 ఏండ్లు దాటిని వాహనాలను అగ్గువకు తుక్కు కింద అమ్మేసి డ్రైవర్లను అటెండర్లుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాత వాహనాలను అమ్మేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. జలమండలి యాజమాన్యం మాత్రం ఆ దిశగా ఆలోచించకుండా డ్రైవర్లు వేధించే పనిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిబ్బంది కొరత ఉన్న చాలా ప్రాంతాల్లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, జనరల్ సెక్రటరీ ఎలమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మేడ్చల్ శ్రీనివాస్, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జమీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్రెడ్డి, వెంకటేశ్ యాదవ్, ఉదయ్, కొమురయ్య, దేవేందర్, రాజేశ్, లక్ష్మణ్, అంజయ్య, శ్రీనివాస్, గోపాలకృష్ణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అక్రమ బదిలీలతో వేధింపులు..
జలమండలి విస్తరణ పేరిట కిందిస్థాయి ఉద్యోగులను నిబంధనలు పాటించకుండా, నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా బదిలీలు చేసి వేధిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉన్నతాధికారులు సీఎం మెప్పు కోసం తపిస్తున్నారని అన్నారు. ఉన్నతాధికారులు కేవలం నోటి లెక్కలతో క్షేత్రస్థాయి పరిస్థితులను ఏ మాత్రం గుర్తించకుండా బదిలీలు చేశారన్నారు. పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగికి స్థానచలనం కల్పించారంటే అధికారుల పనితీరు స్పష్టమవుతున్నదని విమర్శించారు. కనీసం ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా అక్రమంగా బదిలీ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం రెండు, మూడు నెలలు పదవీకాలం ఉన్నవారిని కూడా వదలకుండా కక్షపూరితంగా స్థానచలనం కల్పించారని మండిపడ్డారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొంతమంది మహిళా ఉద్యోగులను ప్రస్తుతమున్న ప్రాంతం నుంచి సుదూరాలకు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అక్రమ బదిలీలను ఉద్యోగ సంఘాల జేఏసీ ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో జలమండలి ఉన్నతాధికారులు.. అవి ట్రాన్స్ఫర్స్ కాదు.. ‘రీ డిప్లాయ్మెంట్’ అని బదిలీలకు కొత్త నిర్వచనాన్ని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం కల్పించాక దాన్ని రీడిప్లాయిమెంట్ అని అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల స్పందించి ఇప్పటికైనా బదిలీలను సమీక్షించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.