ఏరోజైతే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా తిరుగుతుందో ఆరోజే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు. కానీ నేడు రేవంత్రెడ్డి పాలనలో హైదరాబాద్లో పరిస్థితి చూస్తుంటే రౌడీరాజ్యంగా కనిపిస్తున్నదని, మల్కాజిగిరి సీపీ సుమతి దిల్సుఖ్నగర్ బస్స్టాండ్ వద్ద చేసిన ఆపరేషన్ ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా నిలబడితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక మహిళా సీపీ స్వయంగా అనుభవించారని, ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన రేవంత్రెడ్డి పుల్టైమ్ పొలిటీషియన్గానే మిగిలిపోయారు తప్ప.. బాధ్యత గల హోంమంత్రిగా విఫలమయ్యారంటూ వారు ఫైరయ్యారు. సుమతి తాను ఒక సాధారణ మహిళగా దిల్సుఖ్నగర్లో నిల్చుంటే సుమారు 40 మంది పోకిరీలు ఆమెను అడుగడుగునా వేధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో
వైరలయ్యాయి.
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) :మల్కాజిగిరి సీపీ సుమతి దిల్సుఖ్నగర్ బస్స్టాండ్ వద్ద చేసిన ఆపరేషన్ ప్రభుత్వానికి చెంపపెట్టని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు మూడుగంటల పాటు ఒక్కపోలీసు కూడా లేకపోగా, ఆమె ఒంటరిగా అక్కడకు వచ్చిన వారి వెకిలి చేష్టలు, వికృత వ్యవహారాలను చూసి అసలు రోజూ ఇక్కడ ఏం జరుగుతుందోనంటూ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేపథ్యంలో పోలీసుల వైఫల్యంతో పాటు మహిళలకు రక్షణే లేని పరిస్థితిని గమనించారు.
ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో పాటు సోషల్మీడియాలో ఆమె సాధారణమహిళగా దిల్సుఖ్నగర్లో నిలుచుని పోకిరీలతో వేధింపులకు గురవుతున్న దృశ్యాలు, ఫోటోలు పెద్ద ఎత్తున వైరలవడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రికి సూటిగా ప్రశ్నలు వేస్తూ మీరు రాజకీయాల కోసమే హోంశాఖను వాడుకుంటారా లేక ప్రజల రక్షణ కోసం బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ వంటి గ్లోబల్సిటీని నేరగాళ్ల అడ్డాగా మార్చకండంటూ నెటిజన్లు హెచ్చరించారు. మూడు గంటల పాటు ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా లేకపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్టగా చెబుతూ అసలు షీటీమ్స్ ఏమయ్యాయని, బ్లూకోల్ట్స్ ఎక్కడంటూ పోస్ట్ చేశారు.
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం హైదరాబాద్లో మహిళలపై నేరాలు ఆరుశాతం పెరగడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని, పోలీసులను రాజకీయ కక్షసాధింపులకు, అక్రమ కేసులకు వాడుకోవడం మానేసి, ప్రజల రక్షణకు వినియోగించాలని బీఆర్ఎస్ నేత ప్రొ.దాసోజు శ్రవణ్కుమార్ పోస్ట్ చేశారు. హోంమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి విఫలమయ్యారని, ఒక ఐపీఎస్ ఆఫీసర్కే రక్షణ లేని నగరంలో మహిళల భద్రత గాలిలో దీపమేనా తక్షణమే సమాధానం చెప్పాలంటూ ఆయన సోషల్మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఆ తర్వాత మహిళల భద్రత కోసం షీటీమ్స్, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. కానీ దశాబ్ధకాలం తర్వాత కాంగ్రెస్ పాలనలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒక మహిళ ఒంటరిగా రోడ్డుపై నిలుచునే పరిస్థితి లేదంటూ ఆ పోస్ట్లో ఒక మహిళ పేర్కొన్నారు.

Crime
చార్మినార్ వద్ద బెంగాలీ నటికి వేధింపులు..!
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): బెంగాలీ నటి ఈనెల 2న తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం వేళ ఆమె చార్మినార్ వద్ద షాపింగ్ చేస్తున్న సమయంలో టోలిచౌకికి చెందిన అబ్దుల్ వాజిద్ (40) అనే వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు అబ్దుల్ వాజిద్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితుడికి ఏడు రోజుల జైలుశిక్ష విధించారు.