హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahankali ) అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి , సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ( Talasani Srinivas Yadav) కోరారు. శుక్రవారం మహంకాళి ఆలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 256 దేవాలయ కమిటీల సభ్యులకు రూ 1.69 కోట్ల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను (Checks ) రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డిలతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ఈ నెల 21 జరిగే సికింద్రాబాద్ (Secundrabad) బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ (GHMC), దేవాదాయ, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, అగ్నిమాపకం తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు టి.మహేశ్వరి, దీపిక, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.