హైదరాబాద్: హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ జనరల్లోని అమెరికా నావికాదళ సభ్యులు.. కాన్సులేట్లోని ఇతర సిబ్బంది, భారత తూర్పు నౌకాదళానికి చెందిన రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తీతో కలిసి యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ 246వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్కు చెందిన కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మన్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో మొట్టమొదటి మెరైన్ బాల్ను (నావికాదళ జన్మదినోత్సవం) నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు.
ప్రతి నవంబర్లో నావికులు తమ నావికాదళం పుట్టినరోజును జరుపుకుంటారు. ఈసారి పుట్టినరోజు వేడుకలు మాత్రం విదేశాల్లో కూడా జరిగాయి. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో నావికాదళ సహోద్యోగులతో కలిసి వార్షిక మెరైన్ బాల్ను నిర్వహించడం స్టేట్ డిపార్ట్మెంట్ సంప్రదాయంగా వస్తున్నదని జోయెల్ రీఫ్మన్ చెప్పారు.
కాగా, జూన్ 2020లో ఎనిమిది మంది U.S. మెరైన్ కార్ప్స్ సెక్యూరిటీ గార్డ్లు హైదరాబాద్లోని U.S. కాన్సులేట్లో చేరారు. యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ 1948 నుంచి అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల భద్రత, రక్షణలో విధుల్లో పాల్గొంటున్నది. తమ సిబ్బందిని రక్షించడం, జాతీయ భద్రతా సమాచారాన్ని పరిరక్షించడం అమెరికా మెరైన్ కార్ప్స్ సెక్యూరిటీ గార్డ్ల ప్రాథమిక బాధ్యత. U.S. మెరైన్ కార్ప్స్ సెక్యూరిటీ గార్డులు ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాల్లో 181 ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు.
కాగా, భారత తూర్పు నౌకాదళానికి చెందిన రియర్ అడ్మిరల్ సోబ్తి తమతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని అమెరికా కాన్సుల్ జనరల్ రీఫ్మన్ పేర్కొన్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యం వ్యాపారం, విద్య నుంచి సాంస్కృతిక మార్పిడి, భద్రతా సహకారం వరకు ఎన్నింటికో దోహదపడుతున్నదన్నారు. గత నెలలో U.S. చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ విశాఖపట్నంలోని భారత తూర్పు నౌకాదళ కమాండ్ను సందర్శించారని, ఈ సందర్భంగా బంగాళాఖాతంలోని విమాన వాహకనౌక USS కార్ల్ విన్సన్లో భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్కు ఆతిథ్యం ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా భారత్-అమెరికా దేశాల మధ్య భద్రతా భాగస్వామ్యం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.