సికింద్రాబాద్, డిసెంబర్ 31: చేదు, తీపి అనుభవాలు పంచిన ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలు రేకెత్తించే మరో వసంతం కాలు మోపింది. గత రెండేళ్లుగా కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో సంబురాలు జరుపుకోని నగర జనం డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటలు దాటగానే బయటకు వచ్చి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు కొవిడ్ భయం వెంటాడుతున్నా, ప్రజలు ఏమాత్రం బెదరకుండా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు.
2021-22లలో ఎవరికీ పెద్దగా కలిసిరాలేదు. లక్షల మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. పూట గడవటమే కష్టమన్నట్లు నిరుపేదలు కడగండ్లు ఎదుర్కొన్నారు. ఈ విపత్తు నుంచి బయట పడగలమా అన్న సందేహం భీతిగొల్పింది. కానీ దీటుగా నిలబడిన సమాజం.. విపత్తును దాదాపు దాటుకుని వచ్చింది. ఇప్పటికే ఓ అనుభవం ఉన్నందున, కొత్త స్ట్రెయిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం అయింది. అయితే 2023 కొత్త ఏడాది అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిస్తూ.. వేడుకలను జనం ఘనంగా జరుపుకున్నారు.
వేడుకల్లో అపశ్రుతులు జరగకుండా సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లోని నార్త్జోన్ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. యువత ప్యాట్నీ, ప్యారడైజ్, తార్నాక, కార్ఖానా, తిరుమలగిరి, బోయిన్పల్లి, చిలకలగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్, మారేడ్పల్లి ఏరియాల్లోని చౌరస్తాల్లో భారీగా చేరుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సమయానికి మించి ప్రజలు రోడ్లపై ఉండకుండా పోలీసులు వారించి వెనక్కు పంపించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంబరాన్నంటిన సంబరం..
కొత్త ఏడాది వస్తోందంటే మార్కెట్ కిక్కిరిసిపోతుంది. పూల బొకేలు, కేక్లు, స్వీట్ బాక్సులు, పూల మొక్కలు, పండ్లు, చాక్లెట్ బాక్సులు.. ఇలా ఎన్నెన్నో కొనుగోలు చేస్తారు. ఆత్మీయులకు ఇచ్చి సంబరం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్కెట్లో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. గత రెండేళ్లుగా కొద్ది మంది మాత్రమే కేక్లు కొనుగోళ్లు చేసినప్పటికీ శనివారం మాత్రం భారీ ఎత్తున నగర జనం కేక్లను కొనుగోలు చేశారు. ముఖ్య అధికారులు, నాయకులు సైతం సంబరాలల్లో పాల్గొన్నారు. దీంతో బొకేలకూ డిమాండ్ పెరిగింది. బేకరీల వద్ద, ఐస్క్రీమ్ పార్లర్ల వద్ద, హోటళ్ల వద్ద సందడి కనిపించింది. ఇళ్లలో నిర్వహించుకునే వేడుకలకు నగర ప్రజలు కేక్లు, కూల్డ్రింక్లు, ఐస్క్రీమ్లు వంటివి భారీగా కొనుగోలు చేశారు.