సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు బుధవారం రెండు జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి మూసీలోకి నీటిని వదిలారు. ఇప్పటికే గడిచిన ఐదు రోజులుగా హిమాయత్సాగర్ నుంచి మూసీలోకి వరద జలాలు చేరుతున్నాయి. ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కులు దిగువ మూసీ నదిలోకి వదులుతున్నారు.
ఇదే సమయంలో గండిపేట (ఉస్మాన్సాగర్)కు భారీ వరద నీరు వచ్చి చేరడంతో ఈ సీజన్లో తొలిసారి రెండు గేట్లను ఎత్తి దిగువకు 208 క్యూసెక్కుల నీరు వదిలారు. రెండు జలాశయాల నుంచి మొత్తం 2958 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తుంది. మూసీలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ విభాగాల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపు వెళ్లవద్దని జలమండలి ఎండీ దానకిశోర్ విజ్ఞప్తి చేశారు. రాబోయే మరో రెండు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిండు కుండలా మారిన జంట జలాశయాలు జలకళను సంతరించుకోగా.. పర్యాటక సందడి నెలకొంది.
జంట జలాశయాల వివరాలు
హిమాయత్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1763.25 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.875 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1500 క్యూసెకులు
అవుట్ ఫ్లో : 2750 క్యూసెకులు
మొత్తం గేట్ల సంఖ్య : 17 గేట్లు
ఎత్తిన గేట్ల సంఖ్య : 4 గేట్లు (రెండు అడుగుల పైకి)
ఉస్మాన్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1787.15 అడుగులు
ఇన్ ఫ్లో : 1200 క్యూసెకులు
అవుట్ ఫ్లో : 208 క్యూసెకులు
మొత్తం గేట్ల సంఖ్య : 15 గేట్లు
ఎత్తిన గేట్ల సంఖ్య : రెండు గేట్లు (రెండు అడుగుల మేర పైకి ఎత్తారు)