Professor Limbadri | సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఉపాధి కల్పిచడంలో యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఓపెన్ యూనివర్సిటీ, సామాజిక శాస్త్ర విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఐసీఎస్ఎస్సీఆర్ సౌత్ రీజియన్ ఆధ్వర్యంలో సోమవారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘భారత దేశంలో ఉన్నత విద్య – నాణ్యత సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్యలో గణనీయ అభివృద్ధి ఉందని, ఇప్పటికే దేశంలో ఉన్న విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య 28.4 శాతంగా ఉందన్నారు. తెలంగాణలో ఇది 40 శాతం నమోదు కావడం శుభపరిణామమన్నారు. అలాగే, జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాల నమోదు శాతం బాగా పెరిగిందన్నారు.
ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. ఉన్నత విద్యాభివృద్ధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాత్ర చాలా కీలకమన్నారు. అయితే డిగ్రీతో పోల్చితే పీజీలో ప్రవేశాలు పొందుతున్న వారి సంఖ్య 15 శాతం దాటడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, దూర విద్యలో విస్త్రత ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రైవేటీకరణ, మార్కెటీకరణ, సమాజంలో అసమానతలు, పాలకుల్లో చిత్తశుద్ధి లేమి, పక్షపాత ధోరణి వంటివి విద్యా వ్యవస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు. కార్యక్రమంలో ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, అడకమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవీఆర్ఎన్రెడ్డితో పాటు యూనివర్సిటీకీ చెందిన పలువురు సీనియర్ ప్రొఫెసర్లు, డీన్లు తదితరులు పాల్గొన్నారు.