Power Supply | సిటీబ్యూరో, మార్చి 17(నమస్తే తెలంగాణ): వేసవిలో డిమాండుకు అనుగుణంగా నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది. వేసవి కార్యాచరణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న లోడును ముందే గుర్తించిన అధికారులు అదనంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం, ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు కార్యాచరణను రూపొందించారు.
ఇందుకు ఆయా సర్కిళ్ల పరిధిలోని సెక్షన్లలో గత ఫిబ్రవరి నెలలోనే అదనంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లు, కొత్త లైన్లు, సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం అంచనాలను రూపొందించి అనుమతుల కోసం కేంద్ర కార్యాలయానికి పంపించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ప్రాధాన్యత క్రమంగా ఎక్కువ లోడ్ ఉన్న ప్రాంతాల్లో వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని సర్కిల్ అధికారులు పేర్కొంటున్నారు.
వేసవి కార్యాచరణ కోసం టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రత్యేకంగా బడ్జెట్ను సైతం కేటాయించడంతో స్టోర్స్ నుంచి అవసరమైన సామగ్రిని ఆయా సర్కిళ్ల పరిధిలోని సెక్షన్లకు పంపిస్తున్నారు. వేసవి కార్యాచరణలో భాగంగానే గత శనివారం రాత్రి వేళల్లోనే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇలా ముందుగా అంచనాలు రూపొందించిన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తూ విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తున్నామని తెలిపారు.
వేసవి వచ్చిదంటే చాలు విద్యుత్ శాఖపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా కొత్త లైన్లను వేయడంతో పాటు ఉన్నవాటిపై అధిక లోడు పడకుండా సెక్షన్ స్థాయిలో ఏఈ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తూ, విద్యుత్ అంతరాయాలకు అవకాశం లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చేస్తున్నారు. వినియోగంలో ఉన్న సర్వీసులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ప్రతి సెక్షన్లో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రధానంగా వేసవి నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సైతం స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. గత సోమవారం మెట్రో జోన్ పరిధిలోని సబ్స్టేషన్లను ఇన్చార్జి డైరెక్టర్ ఆపరేషన్స్, మెట్రో జోన్ సీజీఎం నరసింహులుతో కలిసి తనిఖీ చేశారు. సబ్ స్టేషన్ నిర్వహణ, పవర్ ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న లోడ్, ఫీడర్ల నిర్వహణ అంశాలను పరిశీలించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని, విద్యుత్ సరఫరాలో విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎండీ ముషారప్ ఫరూఖీ ఆదేశించారు. వేసవి ముగిసే వరకు ఇదే విధమైన పనితీరును కనబర్చి మెరుగైన విద్యుత్ సరఫరాను అందించే కార్యాచరణను అన్ని సర్కిళ్ల పరిధిలో అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.