సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో 1912 కాల్ సెంటర్ సేవలను ఆధునీకరించారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. స్వీకరించేలా వ్యవస్థను ఆధునీకరించారు. గ్రేటర్లో వానకాలంలో తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంటుంది. వినియోగదారులు కాల్ సెంటర్కు ఫోన్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ వల్ల కేవలం 20 లైన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో అన్ని కాల్స్ ద్వారా ఫిర్యాదులను తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చక్కని పరిష్కార మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకేసారి 300 కాల్స్ వచ్చినా.. తీసుకునే ఏర్పాట్లు చేయడంతో పాటు ఐవీఆర్ఎస్( ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా ప్రతికాల్ను నమోదు చేసేలా వ్యవస్థను రూపొందించారు. విద్యుత్ సమస్యలతో పాటు బిల్లులకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులుంటే వాటిని నేరుగా కస్టమర్ సర్వీస్ కేర్ ఎగ్జిక్యూటివ్కు నేరుగా బదిలీ చేస్తారు. ఫిర్యాదులను సులభంగా తీసుకునేలా కాల్సెంటర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని ఈ సందర్భంగా సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.