Hyderabad Book Fair | హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇటీవల బుక్ ఫెయిర్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు జరగనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు ఉంటుంది. శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడే ఉంటే మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.
ఇప్పటికే పుస్తక ఔత్సాహికులు.. బుక్ ఫెయిర్కు వెళ్లి తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది.
అయితే.. పుస్తక అభిమానుల కోసం.. తమ వంతుగా టీఎస్ఆర్టీసీ ఒక ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు వెళ్తున్న వాళ్లకు బస్ టికెట్పై 20 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. కాకపోతే.. అన్ని బస్ టికెట్ల మీద కాకుండా.. ట్రావెల్ యాజ్ యు లైక్(Travel 24 HRS) అనే ఒక రోజు సిటీ బస్ పాస్ మీద 20 శాతం డిస్కౌంట్ అందించింది.
ఈ టికెట్ను హైదరాబాద్ బుక్ ఫెయిర్లోనే ఉన్న ఆర్టీసీ స్టాల్ వద్ద కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మామూలుగా ట్రావెల్ 24 అవర్స్ పాస్ రూ.100 ఉంటుంది. కానీ.. బుక్ ఫెయిర్ దగ్గర మాత్రం రూ.80కే పొందొచ్చు.
పుస్తక ప్రియులకు శుభవార్త. 34 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా, డిసెంబర్ 18 నుంచి 27వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ను సందర్శించే వారి టీ24 టికెట్పై టీఎస్ఆర్టీసీ 20 శాతం తగ్గింపును అందిస్తోందని సజ్జనార్ ట్వీట్ చేశారు.