Health Wellbeing in youth | సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించినప్పుడే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని పలు రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన ప్రముఖులు వ్యాఖ్యానించారు. టీ హబ్ వేదికగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటీ శాఖ, కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం వై20 పేరిట హెల్త్ వెల్బీయింగ్ అండ్ స్పోర్ట్స్ అజెండా ఫర్ యూత్ పేరిట ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు పలు రంగాల్లో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ రఘు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమ, సోషల్ ఆంత్రప్రెన్యూర్ అరుణ్ డేనియల్ యల్లామటి తదితరులు పాల్గొని ప్రసంగించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు సమాజ ప్రోత్సాహం అవసరమని అన్నారు. జీ20-వై20 సదస్సులో భాగంగా ప్రారంభించిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డా.శాంతా తౌటం మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలపై యువతను ప్రోత్సహించడంలో టీఎస్ఐసీ ముఖ్యభూమికను పోశిస్తుందన్నారు.
యువతను భాగస్వామ్యం చేయాలి
యువతలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి వారిని సక్సెస్పుల్ ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతున్నాం. యువతలో ఆరోగ్య సంరక్షణ, క్రీడలపై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా వినూత్న పరిష్కారాలు, ఉత్తమ విధానాలపై ఈ సదస్సులో చర్చించాం. యువత అత్యున్నత స్థాయికి చేరుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే మార్గనిర్దేశం చేయాలి. దేశం ఎదుర్కొంటున్న పర్యావరణం, ఆరోగ్యం, సాంకేతికత, ప్రజాస్వామ్యం వంటి అంశాల్లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా యువ మేధోమథనం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. యువత వెల్లడించిన అంశాలను నివేదిక రూపంలో సెప్టెంబర్లో జరిగే జీ20 సమావేశాల్లో అందజేస్తామన్నారు.
– అలీ సయ్యద్, జీ20-వై20 ప్రతినిధి
మానసిక ఆరోగ్యం ఎంతో కీలకం
ఆధునిక టెక్నాలజీ యుగంలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ప్రస్తుతం చిన్నపాటి మానసిక సంఘర్షణలే ఎన్నో కఠిన నిర్ణయాలకు కారణమవుతున్నాయి. కేవలం మానసికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఆత్మైస్థెర్యం కోల్పోయేలా చేస్తున్నాయి. ఆత్మనూన్యతను తొలగించి స్నేహపూర్వక వాతావరణం అందించాల్సిన అవసరం ఉంది. యువతలో నైపుణ్యాలను వెలికితీసి, ఔత్సాహిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ఐసీ ముఖ్య భూమిక పోశిస్తున్నాయి. డిజిటల్ మాధ్యమాలతో రోజువారీ ఒత్తిళ్లను దూరం చేసుకునే అవకాశం ఉన్నా.. వినియోగంలో నియంత్రణ చాలా అవసరం.
– హేమ, సీతాఫల్ మండి కార్పొరేటర్
సవాళ్లను అధిగమించినప్పుడే సరైన అవకాశాలు
అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పం ఉన్నా.. తొలి అడుగు అంత సులభంగా పడలేదు. ఎన్నో భయాలు, అపోహాలు అన్నింటికి మించి అధైర్యపరిచే ఎన్నో అంశాలు ప్రభావితం చేశాయి. అలాంటి సవాళ్లను అధిగమించినప్పుడే సరైన అవకాశాలతో ఉన్నత శిఖరాలకు చేరవచ్చనేది స్వీయానుభవంతో తెలిసింది. -50 డిగ్రీ సెల్సియస్ పరిసరాల్లో రక్తం గడ్డ కట్టుకుపోయే పరిస్థితులను సైతం ఎదుర్కోగలననే నమ్మకాన్ని పొందగలిగాను. శారీరక, మానసిక ధృడత్వంతోనే సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. అలా 13ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగాను.
– మాలవత్ పూర్ణ, ఎవరెస్ట్ అధిరోహకురాలు