అల్వాల్, అక్టోబర్ 18: అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఆమె కుటుంబాన్ని సోషల్ మీడియాలో వేధిస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో కరీంనగర్కు చెందిన నాగరాజు అలియాస్ అశ్రిత్ అనే యువకుడు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డిని కలిసి.. మీకు నేను పెద్ద అభిమానినని, సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫాలో అవుతానని పరిచయం చేసుకున్నాడు. ఆమె పాల్గొన్న సభలు, సమావేశాలకు కూడా హాజరై కార్పొరేటర్తో ఫొటోలు తీసుకున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయటపడింది
గత మూడునాలుగు నెలల నుంచి శాంతి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యేక్షమయ్యాయి. అప్పటి నుంచి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నంబర్లు మార్చుతూ తరచూ ఆమెను, కుటుంబాన్ని కించపరిచే విధంగా పోస్టులు వస్తున్నాయి. ఆమె వాట్సాప్ డీపీ పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర మెసేజ్లు పంపుతూ బెదిరింపులకు దిగాడు.
అతడి ఆట కట్టించిన పోలీసులు
నిందితుడి వేధింపులతో మానసిక క్షోభకు గురైన కార్పొరేటర్.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. చివరికి నిందితుడి ఐపీ అడ్రస్ను గుర్తించి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు.