శామీర్పేట, ఫిబ్రవరి 4: సత్యాన్ని వెలికితీయడం చాలా ముఖ్యమైనదని ట్రూత్ ల్యాబ్స్ వృత్తిపరమైన పనిని కాలపరిమితిలో కొనసాగిస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ.యూ.లలిత్ అభిప్రాయపడ్డారు. ట్రూత్ ల్యాబ్స్ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిమినల్, సివిల్ కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ అవశ్యకత ఎంతో ఉందన్నారు. డాక్టర్ గాంధీ పీసీ ఖాజా ట్రూత్ ల్యాబ్స్ను ఆరు నగరాల్లో విస్తరించి 24 వేల కేసులను క్లియర్ చేయడాన్ని అభినందించారు. మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్య మాట్లాడుతూ న్యాయ నిర్వహణలో ఫోరెన్సిక్ సైన్స్ ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. పరిశోధన కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకతను ఎత్తిచూపారు.
అనంతరం నల్సార్ లా యూనివర్సిటీ చాన్స్లర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ క్రిమినల్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి ట్రాన్స్ఫోర్ట్ నేరాలను ఎదుర్కోవడంలో డాక్టర్ గాంధీ పీసీ ఖాజా కృషిని ప్రశంసించారు. ట్రూత్ ల్యాబ్స్ ఏర్పాటు, ఫోరెన్సిక్ సైన్స్లో సాధించిన ఫలితాల్లో అనుభవజ్ఞులైన 75 మంది యువ నిపుణుల బృందం చేసిన కృషిని ఉందని ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్ గాంధీ పీసీ ఖాజా వివరించారు. నల్సార్లో నిర్వహించనున్న ఫోరెన్సిక్ సైన్సెస్లో మాస్టర్ కోర్సులకు బంగారు పతకాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జగన్నాథరావు, పీవీ రెడ్డి, భవానీప్రసాద్, డీజీపీ అంజనీకుమార్, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొ. శ్రీకృష్ణదేవరావు, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఇండియా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్, మాజీ ఐపీఎస్ కమల్కుమార్, మాజీ ఐపీఎస్ అంజనేయరెడ్డి, రామ్మోహన్రావు, రఘురామ్, ఉమాపతి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.