వివక్షతో అలిసిన తెలంగాణకు ఉద్యమదీప్తితో చేతనను అందించి.. ఈ ప్రాంత అస్తిత్వం కోసం అహరహం శ్రమించి.. అలుపెరగక పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏండ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోమవారం(ఈ నెల 25న) దాదాపు 6500 మందికి పైగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ప్లీనరీలో కాకతీయ తోరణం, కాళేశ్వరం ప్రాజెక్టు, దుర్గం చెరువు వంటి బ్యాక్ గ్రౌండ్ థీమ్లు అలరించనున్నాయి. 15వేల మందికి సరిపడా 29 రకాల పసందైన రుచులతో భోజనాన్ని వడ్డించనున్నారు.
40 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు గల భారీ ప్రవేశ ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. 36 అడుగుల ఎత్తైన సీఎం కేసీఆర్ కటౌట్ను ఏర్పాటు చేయనున్నారు. 3 వేలకు పైగా వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించారు. సీఎం ఉద్యమ ప్రస్థానం, ఏడేండ్ల పాలనపై ప్లీనరీలో ప్రత్యేక ఎగ్జిబిషన్ జరగనుంది. కాగా, మూడు రోజుల ముందే నగరమంతా ప్లీనరీ శోభ నెలకొన్నది. 20 ఏండ్లుగా చేయిపట్టి తెలంగాణను నడిపిస్తున్న సీఎం కేసీఆర్ను మహానాయకుడిగా, యుగానికొక్కడుగా, దళిత బాంధవుడిగా, తరతరాల యాతన తీర్చి తలరాతను మార్చిన మహానుభావుడిగా వర్ణిస్తూ హైదరాబాద్ నగర దారుల్లో, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి.
ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్లోని హైటెక్స్లో ఈ నెల 25న టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లీనరీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి 6,500 మంది ప్రత్యేక ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆహ్వానితుల జాబితా తయారు చేసిన అధినాయకత్వం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధుల పేర్లను మాత్రమే ఇందులో చేర్చింది. సభకు వెళ్లే ముందు ఆహ్వానితులు హాల్ నంబర్ ఎదురుగా ఉన్న ప్రత్యేక కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
ప్లీనరీ ఏర్పాట్లు పండుగలా సాగుతున్నాయి.
సభా వేదికను అట్టహాసంగా ముస్తాబు చేయడంతో పాటు అతిథులకు సకల వసతులు కల్పించనున్నారు. కాళేశ్వరం, కాకతీయ కళాతోరణం, హైదరాబాద్ ఐకానిక్ ప్రాజెక్టు దుర్గం చెరువుల థీమ్తో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో
భారీ ప్రవేశ ద్వారాన్ని నిర్మిస్తూ ప్రత్యేకాకర్షణగా మలుస్తున్నారు. ఉద్యమ నాయకుడి జీవిత చరిత్ర,
ఏడేండ్ల పాలన, అభివృద్ధిపై ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. అంతేకాక 29 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్తో పాటు సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను నిర్వహణ కమిటీ బాధ్యులు పూర్తి చేస్తే పనిలో పడ్డారు.
ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్లను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన వాహనాలు మాత్రమే హైటెక్స్ లోపల, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల వాహనాలకు జయభేరి వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు వేల వాహనాలు నిలుపేలా స్థలాన్ని చదును చేశారు. జిల్లాల వారీగా వాహనాలకు పార్కింగ్ పాయింట్స్ కేటాయిస్తున్నారు. ఇందుకోసం నలుగురు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లను నియమించారు. పార్కింగ్ ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ పర్యవేక్షిస్తున్నారు.
ప్లీనరీ, విజయగర్జన నేపథ్యంలో గ్రేటర్ అలంకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు రోజుల ముందే ప్రధాన కూడళ్లను ముస్తాబు చేసిన పార్టీ నేతలు తోరణాలతో పాటు సీఎం కటౌట్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్- బేగంపేట, కేబీఆర్ పార్కు – జూబ్లీహిల్స్ చెక్పోస్టు, హైటెక్స్ రూట్లలో భారీ హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. పలు కూడళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
జంక్షన్లలో తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తంగా గ్రేటర్ను గులాబీమయం చేస్తున్నారు.
పార్టీ ఉత్సవాలకు అద్దం పడుతూ ప్రవేశ ద్వారాన్ని 112 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు.
సభా ప్రాంగణంలో కాళేశ్వరం, కాకతీయ కళాతోరణం, దుర్గం చెరువు థీమ్లను ఏర్పాటు చేయనున్నారు.
కాకతీయ ఇన్నోవేటివ్ ఆధ్వర్యంలో 20 ఏ0డ్ల గులాబీ పార్టీ ప్రస్థానాన్ని వివరిస్తూ ‘టీఆర్ఎస్ కాన్సెప్ట్’ పేరిట ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు సంబంధించి 2 వేల ఫొటోలు ప్రదర్శనకు పెట్టనున్నారు.
20 మీటర్ల వెడల్పు కాన్వాస్పై ప్రముఖ చిత్రకారుడు కాంత్రీసా 20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ పలు చిత్రాలు గీయనున్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రక్రియను ప్రారంభించి ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు కాకతీయ ఇన్నోవేటివ్ సంస్థ బందూక్ లక్ష్మణ్, రమేశ్ మదాసు పేర్కొన్నారు.
సభా ప్రాంగణానికి వెళ్లే దారిలో వీ లవ్ టీఆర్ఎస్, టీఆర్ఎస్@20, టీఆర్ఎస్ లవ్ పేరిట ఏర్పాటు చేసిన సెల్ఫీ ఇన్స్ట్రాలేషన్స్ టెక్ట్స్ (సెల్ఫీ పాయింట్స్) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రూపొందుతున్న గులాబీ జెండా డాక్యుమెంటరీ ట్రీజర్ను విడుదల చేయనున్నారు.