సిటీబ్యూరో, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): చికెన్ ధమ్ బిర్యానీ.. మటన్ కర్రీ.. నాటుకోడి పులుసు.. ఎగ్ మసాలా… మటన్ దాల్చా.. బోటి ఫ్రై, తలకాయ పులుసు.. మొదలైన వంటకాలు అతిథులను కడుపునిండా ఆరగించేలా చేశాయి. మాంసాహారులనే కాదు, శాఖాహారులు సైతం గుత్తి వంకాయ, చామగడ్డ, బెండకాయ పులుసులు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారుతో లొట్టలేసుకుని భోంచేశారు. కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారథ్యంలో 36 రకాల పసందైన వంటలు ఘుమఘమలాడాయి.
ప్రజా ప్రతినిధులతో పాటు పోలీసులు, గన్మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు, మహిళలకు ఇలా 20 వేల మంది వరకు అంచనాతో వంటకాలను తయారు చేయించారు. 300 మంది వాలంటీర్లు, తెలంగాణకు చెందిన 650 మంది చెఫ్లు ఈ భోజనాలను అందించారు. కేటగిరీల వారీగా ఆరు డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో భోజనాలు చేసేలా సౌకర్యాలు కల్పించారు. ఒకే సారి 10 వేల మంది భోజనాలు చేసేలా చొరవ తీసుకున్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ‘రాగి సంకటి’ స్పెషల్గా సమకూర్చారు. భోజన ఏర్పాట్లలో భాగంగా ఇతర జిల్లాలు, గ్రామాల నుంచి మేకలను, కోళ్లను ప్రత్యేకంగా తెప్పించడం గమనార్హం. తాను వేలాది మందికి భోజనాలు సమకూర్చడం కొత్తేమి కాదని, టీడీపీలో ఉన్నప్పుడు ఏడు సార్లు, టీఆర్ఎస్లోకి వచ్చాక వరుసగా ప్లీనరీకి మూడు సార్లు భోజన కమిటీ బాధ్యతలు నిర్వహించానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం, ఎలాంటి లోటుపాట్లు లేకుండా భోజనాలు అందించామన్నారు. పార్టీ అతిథులకు భోజనాలు పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు అభిప్రాయం వ్యక్తం చేశారు.