సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ )/మాదాపూర్ : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్లీనరీకి ప్రతినిధులు ఉదయం 10 గంటల నుంచే రావడం ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వాహనాలను ఆయా పార్కింగ్ స్థలాలకు పోలీసులు మళ్లించారు. ముందస్తుగా 50 ఎకరాల్లో 14 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు వాహనాలను తరలించి ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సభ ప్రాంగణంలో మహిళలు, పురుషులు, మీడియా, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
భోజన ఏర్పాట్లకు ఆరు డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసి 36 రకాల రుచికరమైన భోజనాలను అందించారు. ప్లీనరీకి తరలివచ్చిన ప్రతినిధులు గులాబీ చొక్కా, మహిళలు గులాబీ చీరను ధరించడంతో సభ ప్రాంగణమంతా గులాబీ వర్ణంగా మారిపోయింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, యంత్రాంగం అడుగడుగునా మోహరించి భద్రత చర్యలు చేపట్టారు.
నిర్వహణలో ఎక్కడ రాజీ పడకుండా పార్టీ ఏర్పాట్లు చేయడంతో అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణతో సభ సాగిన తీరు అద్భుతమని కొనియాడారు. అన్నింటికంటే మహిళలు, పురుషులు గులాబీ దుస్తులు ధరించి సభకు వచ్చి క్రమశిక్షణకు మారుపేరుగా నిలవడం గమనార్హం.
హైటెక్స్ హెచ్ఐసీసీలోకి చేరిన కొద్ది దూరంలో న్యాక్ బిల్డింగ్ ఎదురుగా సభకు వెళ్లే మార్గం వద్ద భారీ ప్రవేశ ద్వారాన్ని పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ఇరవై ఏండ్ల పూర్తికి అద్దం పడుతూ 112 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో భారీ ప్రవేశ ద్వారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు థీమ్తో ఏర్పాటు చేశారు. 36 అడుగుల ఎత్తుతో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రిజిస్ట్రేషన్ వేదికలోకి ప్రవేశించే ముందు ఈ ప్రవేశ ద్వారం వద్ద సెల్ఫీలతో సందడి చేశారు. భారీ ప్రవేశ ద్వారం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిరూపంతో పాటు బంగారు తెలంగాణ, వీ లవ్ టీఆర్ఎస్, టీఆర్ఎస్@20, టీఆర్ఎస్ లవ్ పేరిట ఏర్పాటు చేసిన సెల్ఫీ ఇన్స్ట్రాలేషన్స్ టెక్ట్స్ (సెల్ఫీ పాయింట్స్) కిటకిటలాడింది.
ప్లీనరీకి వచ్చిన వారందరికీ హైదరాబాద్కే ప్రత్యేకమైన ఇరానీ చాయ్ రుచిని చూపించారు. హైటెక్స్ ప్రాంగణంలో మూడు చోట్ల విశాలమైన ప్రాంగణంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వారంతా ఎంతో ఇష్టంగా ఇరానీ చాయ్ రుచిని అస్వాదించారు. రోజంతా కలిపి 30వేలకు పైగా ఇరానీ చాయ్లను అందించినట్లు నిర్వాహకుడు సోహేల్ ఖాన్ చెప్పారు.