ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 2: అత్యున్నత డిగ్రీ అయిన పీహెచ్డీని సాధించడం సాధారణంగా చాలా కష్టం. అది కూడా రెండుసార్లు.. ఈ ఘనతను సాధించడం మామూలు విషయం కాదు. మారుమూల గిరిజన తండాలో జన్మించిన గుగులోతు శ్రీదేవి ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రెండో డాక్టరేట్ను సాధించింది. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా రికార్డు సృష్టించింది. ఓయూ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్ సక్కు భావ్య పర్యవేక్షణలో “టీచర్స్ యాటిట్యూడ్ అండ్ ఎఫెక్టివ్నెస్ టువర్డ్స్ ఐసీటీ – ఏ స్టడీ ఆన్ ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ సెకండరీ స్కూల్స్ ఇన్ తెలంగాణ” అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి శ్రీదేవి సమర్పించిన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆమెకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆమె 2013లో ఓయూ సోషియాలజీ విభాగంలో ప్రొఫెసర్ విజయ పర్యవేక్షణలో “ఎడ్యుకేషనల్ పర్ష్యూట్స్ : పర్ఫార్మెన్స్ అండ్ ప్రాబ్లమ్స్: ఏ సోషియోలాజికల్ స్టడీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ తెలంగాణ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధర్మాపురం తండాలో జన్మించిన ఆమె, చదువు పట్ల ఉన్న ఆసక్తితో ఓయూ నుంచి ఎంఏ, ఎంఈడీ, సోషియాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం ఎడ్యుకేషన్లో జేఆర్ఎఫ్ సాధించి జాతీయ స్థాయి ఫెలోషిప్ను అందుకున్నారు. తన పరిశోధనా క్రమంలో ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని తన పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.