కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 20 : జీడిమెట్ల డివిజన్ రంగారెడ్డిబండలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్రెడ్డిపై మహిళలు తిరగబడ్డారు. శుక్రవారం ఉదయం సుదర్శన్రెడ్డి రంగారెడ్డిబండకు వెళ్లి వీడియో తీస్తుండగా అక్కడే కొన్నేండ్లుగా ప్రభుత్వ స్థలం, సర్వేనంబర్ 25/1 లో గుడిసెలు వేసుకొని ఉంటున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా అడ్డుకున్నారు. అయితే మహిళలు స్నానాలు చేస్తుంటారని, బహిర్భూమికి వెళ్తారని.. ఎందుకు వీడియోలు తీస్తున్నావంటూ మహిళలు సుదర్శన్ రెడ్డిపై దాడి చేశారు. కాగా స్థానికంగా తమకు పట్టాలు ఇచ్చిన స్థలాల్లో మట్టిపోసుకొని రేకులు వేసుకుంటే సుదర్శన్రెడ్డి డబ్బులు చెల్లించాలని అడుగుతున్నాడని.
లేనిపక్షంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి గుడిసెలు కూల్చివేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్థానిక మహిళలు ఆరోపించారు. శుక్రవారం ఉదయం రంగారెడ్డిబండలో సుదర్శన్రెడ్డి తన సెల్ఫోన్లో ఫొటోలు తీస్తుండగా ఈ ఘటనకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని, కావాలనే తనపై మహిళలు దాడికి పాల్పడ్డారని సుదర్శన్రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా రంగారెడ్డిబండలో భూ అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోనే తనపై దాడి జరిగిందని సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ సీఐ విజయ్వర్ధన్రెడ్డి వివరణ కోరగా సుదర్శన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.