ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 1: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని గిరిజన శక్తి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ చౌహాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన శక్తి రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ చౌహాన్, శరత్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014లోని 13వ షెడ్యూల్లో తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఆరు సంవత్సరాలు గడిచినా, ఏ మాత్రం గిరిజన విద్యార్థులపై చిత్తశుద్ధి లేకుండా వారిని చదువుకు దూరం చేసే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం బాధాకరమన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వర్సిటీ ఏర్పాటులో ఆరేళ్ల జాప్యం వలన గిరిజన విద్యార్థులు చదువు, పరిశోధనల్లో వెనుకపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వెంటనే వర్సిటీని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోర్ మాటి సినిమా డైరెక్టర్ శంకర్ జాదవ్, గిరిజన శక్తి నాయకులు జ్యోత్స్న, భరత్ నాయక్, కార్తీక్ నాయక్, సిద్ధార్థ్ నాయక్, మోహన్ నాయక్, మధు, సంతోష్, అజయ్, రాజేశ్, లింగం, భాస్కర్, మహేశ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.