సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : కరోనా తగ్గుముఖం పట్టడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రజారవాణాలో కీలకమైన ఆర్టీసీ, లోకల్, మెట్రో రైళ్లు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. జంటనగరాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో 80 శాతం ప్రైవేటు కార్యాలయాల్లో వర్క్ఫ్రం హోం విధానాన్ని తొలగించడంతో సిబ్బంది మొత్తం తిరిగి కార్యాలయాలకు వెళ్లుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2400పైగా సిటీ బస్సులు రోడ్డెక్కగా, ప్రతినిత్యం సుమారు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కరోనా కన్నా ముందు నిత్యం సిటీ బస్సుల ద్వారా రూ.3.50 కోట్ల వరకు రాబడి ఉంటే.. ప్రసుత్తం రూ.1.55 కోట్ల వరకు వస్తుందని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల తగ్గిన ఆక్యుపెన్సీ..ఇప్పుడు క్రమంగా మెరుగుపడుతుండడంతో కొంతవరకు ఉపశమనం లభించినట్లు ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
సిటీ బస్సులు తిరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్న ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లు కూడా పరుగులు పెడుతున్నాయి. గతనెల 23 నుంచి పది సర్వీసులను ప్రారంభించగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈనెల 1వ తేదీ నుంచి మరో 45 సర్వీసులను పునరుద్ధరించడంతో మొత్తం 55 లోకల్ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలక్నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి స్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. ఈ రైళ్లలో ప్రస్తుతం 30 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉన్నదని, క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి త్వరలో మరికొన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని అంటున్నారు.
గత ఏడాది సీజనల్ పాసులు తీసుకున్న వారు లాక్డౌన్ వల్ల నష్టపోయారు. ఎన్ని రోజులు నష్టపోయారో.. తిరిగి అన్ని రోజులు పాస్లు చెల్లుబాటయ్యేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాస్లు పొందిన వారికి ఉపశమనం కలిగినట్లయ్యింది.
కొంతకాలంగా ప్రయాణికుల్లేక వెలవెలబోయిన మెట్రో రైళ్లల్లో క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో మెట్రో రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరరోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరగడం, గమ్య స్థానం చేరుకోవాలంటే మెట్రో రైళ్లే ప్రత్యామ్నాయంగా మారాయి. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రారంభమయ్యే స్టేషన్లో ఆఖరి రైలు రాత్రి 9.45 గంటల వరకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 7 గంటలకు మొదటి రైలు ప్రారంభమై, చివరి రైలు 9.45 గంటలకు బయలుదేరి, రాత్రి 10.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మొదటిదశ కరోనాకు ముందు ప్రతిరోజు మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించగా, ఇప్పుడు మూడు కారిడార్లలో కలిపి 70 నుంచి 80 వేల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.