సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మండుతున్న ఎండలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. విద్యుత్ వాడకం పెరిగిపోతుండడంతో ట్రాన్స్ఫార్మర్లపై అధికలోడ్ పడి కాలిపోతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో ఏసీలు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్నది. విద్యుత్ వాడకం అధికమైతే ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ హీటెక్కి.. పెద్ద శబ్ధంతో పేలిపోతున్నాయి.
ఓవర్లోడింగ్, అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం, తగినంత శీతలీకరణ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కుతున్నాయని విద్యుత్ నిపుణులు చెప్పారు. ఎక్కువ మొత్తంలో లైఫ్టైమ్ పూర్తయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని , సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా కాలిపోతున్నాయని సిబ్బంది చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఓవర్లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కి కాలిపోతున్నాయంటూ వారు పేర్కొన్నారు. అయితే రోజురోజుకూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ సరఫరా గంటలకొద్దీ నిలిచిపోవడంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
రోజుకు సగటున 50
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 6లక్షల 35వేల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా డీటీఆర్ల సామర్థ్యాన్ని పెంచకపోవడం, లోడ్ బ్యాలెన్స్ చేయకపోవడం, ఆయిల్ లీకేజిలను అరికట్టకపోవడం, ఎప్పటికప్పుడు టంగ్ టెస్టర్తో లోడును పరిశీలించకపోవడం, వినియోగం అనూహ్యంగా పెరిగిపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి. గత ఐదురోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పేలిన ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈనెల 18న 54, 19న 62, 20న 72, 21న 72, 22న 52, 23న 60 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. కేవలం 23 రోజుల్లో 860 డీటీఆర్లు(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు)కాలిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు.
అయితే ఈ పరిస్థితి నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా ఉందని, ఎక్కువగా సైబర్సిటీ, రాజేంద్రనగర్, సర్కిళ్లలో ఉన్నట్లు విద్యుత్ అధికారులు గణాంకాలను బట్టి గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో వస్తున్న సమస్యను అధిగమించడానికి లోడ్ రిలీఫ్ తీసుకుంటున్నట్లు తెలిసింది. రోజుకు సగటున 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడంతో కేవలం నగరంలోనే ఇంత మొత్తంలో సమస్య ఉంటే దక్షిణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనావేశారు. శుక్రవారం మాదాపూర్ సబ్స్టేషన్, స్విచ్స్టేషన్లను సీఎండీ జితేశ్ తనిఖీలు చేశారు.