మేడ్చల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం (నేడు) నుంచి టీచర్లు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే మొదట ప్రధానోపాధ్యాయులు, అనంతరం స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలను విద్యాశాఖ చేపట్టనున్నది. మేడ్చల్- మల్కాజిగిరి జిలాల్లో 5 నుంచి 8 సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల బదిలీలు జరుగనున్నాయి. జిల్లాలోని 504 ప్రభుత్వ పాఠశాలల్లో 2,928 ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో సుమారు 1800 మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగే అవకాశం ఉంది. వంద మందికి పైగా పదోన్నతులు పొందనున్నారు. 150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీఈవో విజయకుమారి వెల్లడించారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించడం అభినందనీయం
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వం స్పందించడం అభినందనీయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ బదిలీలు, పదనోత్నలకు మార్గదర్శకాల జారీ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతి ద్వారా లబ్ధి చేకూరనున్నది. దూర ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీల ద్వారా వారు కోరుకున్న స్థానానికి వచ్చే అవకాశం ఉంది. కోర్టులో ఉన్న స్టే ఎత్తి వేసిన వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. బదిలీల షెడ్యూల్ ఇచ్చిన ప్రభుత్వానికి పీఆర్టీయూఎస్ తరఫున కృతజ్ఞతలు. అర్హులైన ఏ ఒక్కరికీ నష్టం జరుగకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం సంతోషంగా ఉంది.
– రామేశ్వర్గౌడ్, పీఆర్టీయూఎస్ జిల్లా అధ్యక్షుడు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు వెంటనే షెడ్యూల్ విడుదల చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఎన్నో ఏండ్లుగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ బదిలీలతో తమ సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉన్నారు.
– ఆనంద్రెడ్డి, జిల్లా పీఆర్టీయూఎస్ ప్రధాన కార్యదర్శి
నిబంధనల మేరకు బదిలీలు, పదోన్నతులు
ప్రభుత్వ నిబంధనల మేరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. గతంలో బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తులు చేసుకునే అవసరం లేదు. 5, 8 సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేసిన వారు దరఖాస్తులు చేసుకోనట్లయితే ఇప్పుడు చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 18 వందల బదిలీలు జరిగే అవకాశం ఉంది. పారదర్శకంగా బదిలీలు, పదోన్నతుల పక్రియ ఉంటుంది.
– మేడ్చల్- మల్కాజిగిరి డీఈవో విజయకుమారి