సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు కొంతకాలంగా వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. చెప్పినా వినని.. నిబంధనలు పాటించని వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రమాదాలు తగ్గించే క్రమంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. ఈ క్రమంలోనే రాంగ్సైడ్, ట్రిపుల్ రైడింగ్పై వచ్చే సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, ఈ వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. రోప్ అమలులో భాగంగా నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్పై వాహనదారులకు సోమవారం నుంచి అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఆ ఒక్క శాతం వారితోనే ప్రమాదాలు..
దాదాపు 99 శాతం మంది వాహనదారులు పక్కాగా నిబంధనలు పాటిస్తున్నారు. నిబంధనలు పాటించని ఒక్క శాతం వల్లే సమస్యలు వస్తున్నాయి. వీరివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ఒక్క శాతం వాహనదారులను కూడా నిబంధనలు పాటించేలా చేయాలన్న ఉద్దేశంతోనే నిరంతం స్పెషల్ డ్రైవ్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇందులో భాగంగానే రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్పై ఈనెల 27 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిలో మార్పు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొందరు చలాన్లు పెంచేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా అవాస్తవమని చెప్పారు.
బైక్లు.. ఆటోలకు జరిమానాల్లో తగ్గుదల..
రాంగ్ సైడ్ డ్రైవింగ్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదం తక్కువగా ఉంటుంది. భారీ వాహనాలు రాంగ్ రూట్లో రావడంతో భారీ నష్టం కలుగుతుంది. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని బైక్లు, ఆటోలకు రాంగ్ సైడ్ డ్రైవింగ్పై జరిమానాలు తగ్గించారు. కార్లు, భారీ వాహనాల వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటిపై విధించే చలాన్ కూడా కొంత ఎక్కువగానే ఉంటుందని రంగనాథ్ తెలిపారు.
వెంటనే చలాన్ చెల్లిస్తే ఇబ్బందులుండవు..
ద్విచక్ర వాహనం, ఆటోలపై మొదటిసారి రాంగ్ సైడ్ డ్రైవింగ్పై చలాన్ విధించిన వెంటనే చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రంగనాథ్ తెలిపారు. రెండోసారి రాంగ్ రూట్లో వెళ్లినా రూ. 200 చలాన్ ఉంటుందన్నారు. మొదటి చలాన్ చెల్లించకుండా, రెండో చలాన్ విధించే వరకు అది పెండింగ్లో ఉందంటే.. రూ. 200తో పాటు అదనంగా రూ. 500 కలిపి జరిమానా విధిస్తారు. అక్కడి నుంచి అంతే జరిమానా విధిస్తారు. పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకోవడంతో తిరిగి మొదటికి వస్తుందని తెలిపారు.యూ
టర్న్లపై సమీక్ష: జాయింట్ సీపీ
వాహనదారుల్లో క్రమ శిక్షణ తీసుకొచ్చి, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గిస్తూ, సాఫీగా నగరంలో వాహనదారులు ప్రయాణించేలా చేసే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. ఇందుకు రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రాక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్) ను అమలు చేస్తున్నాం. రాంగ్సైడ్, ట్రిపుల్ రైడింగ్పై వచ్చే వారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ వారం వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చలాన్లు పెంచారని, చలాన్లు తగ్గించాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు, కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఉపయోగించే బైక్లు, ఆటోలకు సంబంధించి రాంగ్సైడ్ డ్రైవింగ్ చలాన్లు తగ్గించాం. అవగాహనతో పాటు రాంగ్సైడ్కు కారణాలను విశ్లేషిస్తున్నాం. ఇందులో యూటర్న్లు కీలకం. చౌరస్తా నుంచి యూటర్న్కు ఉన్న మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో అక్కడ రాంగ్సైడ్ డ్రైవింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దీనిపై సమీక్ష నిర్వహించి, ఎక్కడైనా చౌరస్తా నుంచి యూటర్న్కు దూరం ఎక్కువగా ఉంటే, అక్కడ తగిన చర్యలు తీసుకుంటామని రంగానాథ్ వెల్లడించారు.
సమన్వయంతో ముందుకు వెళ్దాం
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): నగరంలో ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రై పోలీస్ కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సూచించారు. సోమవారం ట్రై పోలీస్ కమిషనరేట్ల ట్రాఫిక్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, పలు అంశాలపై చర్చించారు. కమిషనరేట్ సరిహద్దుల మధ్య ట్రాఫిక్ ఫ్లో, సిగ్నల్, కమ్యూనికేషన్, వీఐపీ మూవ్మెంట్, ఈ చలాన్, ఇంజినీరింగ్, భారీ వాహనాలు, సెవెన్ సీటర్స్, షేరింగ్ ఆటోల ప్రవేశం, నిషేధిత సమయంలో నగరంలోకి భారీ వాహనాల ప్రవేశం, రోప్ అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు ప్రకాశ్రెడ్డి, కరుణాకర్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్, అదనపు డీసీపీ ప్రసాద్, రాచకొండ అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.