సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 64 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 12 మంది మృతి చెందగా, 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటిపై అధ్యయనం చేసిన అధికారులు.. వాహనదారుల నిర్లక్ష్యం…అతివేగం…మద్యం సేవించి నడపడం…అవగాహన లేమి వంటివి ఈ ఘటనలకు కారణాలుగా తేలాయి. ఇలా ప్రమాదాలను విశ్లేషించడంతో పాటు లోటుపాట్లను గుర్తించారు. పలు చోట్ల ప్రమాదకరంగా ఉన్న యూ టర్న్లను తొలగించారు. మరికొన్ని చోట్ల ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝళిపించారు. మరోవైపు హెల్మెట్లు ధరించకుండా ప్రయాణించిన 27 వేల మంది వాహనదారుల ఫొటోలను దించి.. వారికి చలాన్ల రూపంలో రూ. 52 లక్షల జరిమానాలు వేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 234 మందిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం రూ. 5.84 లక్షల జరిమానాలను విధించింది.
ఇక అతివేగంతో దూసుకుపోయిన 1500 మంది వాహనదారులకు రూ. 15 లక్షల చలాన్లు వేశారు. మొత్తంగా ఈ వారంలో వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై ఫొటో ఆధారాలతో 30 వేలకు పైగా చలాన్లు విధించారు. ఆ రుసుము రూ. 1.46 కోట్లకు చేరింది. 85 అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రాచకొండ పోలీసులు.. సుమారు 2011 మందికి పాటించాల్సిన నిబంధనలను వివరించారు.