హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం దృష్ట్యా ఆదివారం(జులై 10) నాడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, మాసాబ్ ట్యాంక్లోని హాకీ గ్రౌండ్ పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
-పురానాపూల్, కామాటిపుర, కిషన్ బాగ్ నుంచి మీరాలం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అయితే ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను బహదూర్ పురా ఎక్స్ రోడ్డు మీదుగా అనుమతించనున్నారు. కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు. జూపార్క్ తో పాటు ఆ పరిసరాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చని చెప్పారు.
-శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి ప్రార్థనల కోసం మీరాలం వైపు వచ్చే వారు తమ వాహనాలను దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు వరకు అనుమతించనున్నారు. సాధారణ ట్రాఫిక్ను దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట మీదుగా మళ్లించనున్నారు.
-కాలపత్తార్ నుంచి వచ్చే వారు తమ వాహనాలను కాలపత్తార్ లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ వరకు మాత్రమే అనుమతించనున్నారు. సాధారణ ట్రాఫిక్ను మోచి కాలనీ, బహదూర్ పురా, షంషీర్ గంజ్, నవాబ్ సాహిబ్ కుంట మీదుగా మళ్లించనున్నారు.
-మెహిదీపట్నం, లక్డీకాపూల్ నుంచి వచ్చే వాహనాలను మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కిందకు అనుమతించరు. కేవలం ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నారు. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు వెళ్లే వాహనదారులు.. మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్, అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, తాజ్ కృష్ణ హోటల్ మీదుగా వెళ్లాలి.
-లక్డీకాపూల్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు వెళ్లే వాహనదారులు.. నిరంకారి, ఖైరతాబాద్, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, తాజ్ కృష్ణ హోటల్ మీదుగా వెళ్లాలి. బంజారాహిల్స్ నుంచి లక్డీకాపూల్, మోహిదీపట్నం వెళ్లే వాహనదారులు కూడా పైమార్గాలనే అనుసరించాలని సూచించారు.