రోడ్డుపక్కన నిలిపిన వాహనాలను క్రేన్లతో తొలగించిన సిబ్బంది
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా యజమానులకు నోటీసులు
అబిడ్స్, మార్చి 29 : నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్డుపై నిలిపిన వాహనదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులను నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. తరలింపు ప్రక్రియను గోషామహల్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ బి.కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు కె .వెంకటేశ్వర్, జావేద్ పర్యవేక్షించారు.
5 వాహనాలను సీజ్ చేసి కాచిగూడ పోలీస్స్టేషన్కు తరలింపు
సుల్తాన్బజార్, మార్చి 29 : సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసామియాబజార్, బడీచౌడి, ప్రగతి లేన్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో ఏండ్లు, నెలల తరబడి రోడ్లపై వాహనాలను నిలపి ఉన్న 12 వాహనాలను మంగళవారం గుర్తించారు. ఆయా వాహనాల యజమానులకు సమాచారం, నోటీసులు అందించారు. 7 వాహనాల యజమానులు తమ వాహనాలను తీసుకువెళ్లగా, మిగతా 5 వాహనాలను కాచిగూడ పోలీస్స్టేషన్కు తరలించారు.ఈ డ్రైవ్లో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రసాద్,ఈస్ట్జోన్ ఏసీపీ సంపత్కుమార్,సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ ఎం.సుమన్కుమార్ పాల్గొన్నారు.
మెహిదీపట్నం, మార్చి 29 : టోలిచౌకి,ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో మంగళవారం ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్లు శంకర్ రెడ్డి, సుధీర్కుమార్ తమ సిబ్బందితో కలిసి కార్లు, జీపులను తరలించారు.
చార్మినార్, మార్చి 29 : నగర ట్రాఫిక్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు చార్మినార్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిపిన వాహన యజమానులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. నోటీసులను స్వీకరించిన యజమానుల నుంచి స్పందన రాకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. చార్మినార్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం నుంచి ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. పంజేషా, మదీనా ప్రాంతంలో నెలల తరబడి పార్క్ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పార్క్ చేసి వదిలేసిన వాహన యజమానులకు చలానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.