రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి. అర్ధరాత్రి 2.00 గంటల సమయం. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై ఆపి ఫొటోలు దిగేందుకు వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వాహనం పార్కింగ్ చేయకండి.. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.. వెంటనే అక్కడి నుంచి తీసేయండి.. సీసీ కెమెరాలు ఉన్నాయి.. అంటూ బాటసారులకు చెప్పారు. కెమెరాల ద్వారా పోలీసులు చూస్తున్నారన్న భయంతో యువకులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాదాపూర్ ఐటీసీ కోహినూర్ వద్ద ట్రాఫిక్ అధికారులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకొని కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కారును టర్న్ చేసుకుని రాంగ్రూట్లో ప్రయాణించాడు. ఆ తొందర పాటులో ఓ వాహనదారుడిని ఢీ కొట్టాడు. అతడి కాలు విరిగింది. కారును ఆపకుండా పారిపోయాడు. వెంటనే మాదాపూర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ అధికారులకు సమాచారం వచ్చింది. 8 నిమిషాల్లో ఆ వాహనదారుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన రెండు రోజుల కిందట అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది.
మీరు రోడ్డుపై కారును నిలపడంతో ట్రాఫిక్ జామ్కు అవకాశం ఉంది. అసలే ఇది రద్దీ టైం సార్. పార్కింగ్ స్థలంలో కారు పార్క్ చేయండి. కారు యజమాని వినలేదు. వెంటనే 4 నిమిషాల్లో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్కు అడ్డంగా వాహనాన్ని ఎందుకు నిలిపారో ఆరా తీశారు. కారు యజమానికి చలాన్ రాశారు. కారును అక్కడి నుంచి తీయించి ట్రాఫిక్ ఇబ్బంది తొలగించారు.
ఓ యువకుడు ప్రతి రోజు రాంగ్రూట్లో ప్రయాణం చేస్తున్నాడు. ఇది ఇతరులకు ప్రాణసంకటంగా మారింది. వాహనదారుడు చేసే ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అతడి రాంగ్ రూట్ డ్రైవింగ్ బంద్ అయ్యింది.
ఈ విధంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు నిరంతంరం గమనిస్తున్నారు. ఎనిమిది జంక్షన్లలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడంతో పాటు రోడ్డు ప్రమాదాలు చేసి పారిపోతున్న వారి ఆచూకీ కూడా తెలుసుకుంటున్నారు. ఏ సమయమైనా ప్రత్యక్షంగా చూస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో అత్యంత కీలకమైన విప్రొ, ట్రిపుల్ ఐటీ, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, హైటెక్స్, సైబర్ టవర్స్, రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్తో ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ జామ్లు లేకుండా వాహనదారులకు సాఫీ ప్రయాణాన్ని కల్పిస్తున్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్ ఈ జంక్షన్ల వద్ద అత్యాధునిక 64 సీసీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్లను ఏర్పాటు చేయించారు. ఈ కెమెరాలను సైబరాబాద్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడంతో 24 గంటల పాటు ట్రాఫిక్ పర్యవేక్షణ కొనసాగుతున్నది. దీంతో గతంలో ఉండే ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోయాయి. వీకెండ్ రోజుల్లో ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా 60 నుంచి 70 చలాన్లు జారీ చేస్తున్నారు. త్వరలో మిగతా సీసీ కెమెరాలను కూడా అనుసంధానం చేస్తా మని ఇక సైబరాబాద్ పరిధిలో 24 గంటల పాటు ట్రాఫిక్ రాకపోకలపై నిఘా ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.