సిటీబ్యూరో, అక్టోబరు 12 (నమస్తే తెలంగాణ): పాదచారుల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న తరహాలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాదచారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు సురక్షితమైన బాటను నిర్మించేందుకు కసరత్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పెడెస్ట్రీయన్స్ (పాదచారులు) రెఫ్యూజీ ఐల్యాం డ్స్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత కేపీహెచ్బీ జేఎన్టీయూ జంక్షన్ను ఎంచుకున్నారు. ఈ ఐల్యాండ్ ఏర్పాటుకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ పాదచారుల ఐల్యాండ్ నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేసి, పనులు ప్రారంభించారు.
పాదచారులు రోడ్డు దాటేందుకు ఈ ఐల్యాండ్ ఒక పాయింట్గా పని చేస్తుంది. రోడ్డు దాటాలనుకునే పాదచారులు ఈ పాయింట్ దగ్గరకు వచ్చి నిలబడుతారు. పాదచారుల సిగ్నల్ పడిన వెంటనే సురక్షితంగా రోడ్డును సాఫీగా దాటుతారు. చాలా సందర్భాల్లో పాదచారులు ఫోన్లో మాట్లాడుతూ, కంగారులో రోడ్డును దాటేస్తుంటారు. ఇలాంటి దృశ్యాలకు ఇక చెక్ పడనుంది. పాదచారులు ఎలాంటి భయాందోళన చెందకుండా రోడ్డును దాటేందుకు రోడ్డు క్రాసింగ్ స్పాట్స్ నిలుస్తాయని ట్రాఫిక్ అధికారులు ఆశిస్తున్నారు. ఐల్యాండ్స్ ఏర్పాటుకు రోడ్లపై ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి అక్కడ నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జేఎన్టీయూ జంక్షన్ వద్ద ప్రతి మూడు నిమిషాలకు దాదాపు 70 నుంచి 80 మంది వేగంగా దూసుకువస్తున్న వాహనాల మధ్య నుంచి రోడ్డును దాటుతున్నారు. ఈ దృశ్యాన్ని పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ తనకు వచ్చిన ఆలోచనతో ఈ పెడెస్ట్రీయన్ రెఫ్యూజీ ఐల్యాండ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దశల వారీగా ఇలాంటి ఐల్యాం డ్స్ రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఐల్యాండ్స్ నిర్మాణానికి జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్లపై పాదచారులకు పూర్తి రక్షణను కల్పించనున్నారు.
ఒక సైబరాబాద్లోనే వివిధ రకాల రోడ్డు ప్రమాదాల్లో ప్రతి యేటా దాదాపు 700కు పైగా మరణాలు సంభవిస్తున్నాయని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అందులో పాదచారుల మరణాలు చాలా ఉంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు సైబరాబాద్ పరిధిలో 145 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారు.