ఆ ప్రాంతంలో ఒకప్పడు ఇండ్లు అద్దెకు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా ఆకాశన్నంటే అద్దెలు.. అడ్జెస్ట్ చేసుకునే గదులు.. టూలెట్ బోర్డు పెట్టిన క్షణాల్లో రూంలు భర్తీ అయ్యేవి. దీంతో ఇంటి యజమానుల వ్యాపారం ‘మూడు పువ్వులు..ఆరు కాయలుగా’ వర్ధిల్లేది..
కానీ కరోనా దెబ్బకు ఆకాశన్నంటిన ఇంటి అద్దెలు దిగొచ్చాయి.. అద్దె ఎంత వచ్చినా సరే ముందుగా రూంలు ఖాళీగా ఉంచొద్దు అనే భావనకు చాలా మంది యజమానులు వస్తున్నారు.. అద్దె అని వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపించకుండా వారితో భర్తీ చేసుకుంటున్నారు. దీనంతటికీ కరోనాయే కారణం.. ఇందంతా ఎక్కుడో కాదు.. హైటెక్సిటీకి కూతవేటు దూరంలో ఉండే అల్లాపూర్ డివిజన్లో ఇంటి అద్దెల వ్యవహారం.
మాదాపూర్లో భారీ ఐటీ పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు , హోటల్స్, మాల్స్, వివిధ వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో దేశం నలుమూల నుంచి ఉద్యోగులు, వలసకూలీలకు, ఉపాధి లభిస్తుండడంతో అల్లాపూర్ డివిజన్లో అమాంతం భూముల రేట్లు పెరిగి ఇండ్లు అద్దెలకు ఇచ్చేందుకు పెద్దపెద్ద భవనాలు వెలిశాయి . ఉద్యోగులు ట్రాఫిక్ సమస్యలేకుండా తక్కువ సమయంలో ఇంటినుంచి ఆఫీసులకు చేరుకోవడానికి సులువుగా వెళ్లేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే వారు. మాదాపూర్కు అతి చేరువలో ఉన్న ప్రాంతాలు మోతీనగర్, పీఆర్ నగర్, గాయత్రీనగర్, వీవీవేకానందనగర్, పర్వత్నగర్, వంటి కాలనీలు దగ్గరగాఉంటాయి.
ఈ ప్రాంతాల్లో అద్దెఇండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సింగిల్ బెడ్ర్రూం రూ. 10 నుంచి 14 వేలు, డబుల్ బెడ్ర్రూం రూ. 16 నుంచి 20 వేల వరకు ఉండేవి. ఇలా ఇల్లు ఖాళీ అవ్వగానే వెంటనే అలా అద్దెకు దిగిపోయేవారు. కానీ కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా అన్ని రంగాల వ్యాపారాల పై తీవ్ర ప్రభావం చూపడంతో వలసకూలీలు తమతమ సొంతూళ్లకు వెళ్లిపోగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారి ఇంటినుంచే పని చేస్తున్నారు. కరోనాకు ముందు ఎంత వెతికినా టూలెట్ బోర్డు కనిపించడం కష్టగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ వీధి చూసినా టూలెట్ బోర్డులే ఇంటిముందున్న గేటుకు వేలాడుతున్నాయి.
ఒకప్పుడు రూ.14 వేలు ఉన్న సింగిల్ బెడ్ రూం ఇప్పుడు రూ.7 నుంచి 8 వేలకే ఇస్తామంటున్నారు ఇంటి యజమానులు.. కారణం పనులు లేక వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో అప్పటి రేట్లనే కొనసాగిస్తే అద్దెలు భర్తీ అయ్యే పరిస్థితులు ఏ మాత్రం లేవని అంటున్నారు. మొత్తం ఖాళీగా ఉండే బదులుగా అందుబాటులో ఉండే రేట్లతో భర్తీ చేస్తే ఇరువురికి లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు.
కరోనాతో అన్ని రంగాలపై తీరని భారంపడింది. వ్యాపారాలు ఎప్పటికి కోలుకుంటాయో చెప్పలేని పరిస్థితి. గతంలో ఇండ్ల అద్దెల కోసం కొత్తగా వచ్చిపోయే వారితో కాలనీ సందడిగా ఉండేది. ఇప్పడు ఆ పరిస్థితి మారింది. టూలెట్ బోర్డు పెట్టి నెలలు గడుస్తున్నా.. అద్దె ఇల్లు భర్తీకావడం లేదు. స్కూళ్లు ప్రారంభమై మూడో దశరాకపోతే పరిస్థితుల్లో మార్పు రావొచ్చేమో వేచి చూడాలి. -పిల్లి తిరుపతి, వివేకానందనగర్