‘జండా ఒక్కటె మూడు వన్నెలది.. దేశంబొక్కటె భారతాఖండసేతు హిమాచలోర్వర’ మంటూ నాడు మహాకవి దాశరథిహిమాలయోన్నతమైన భరతమాత ఔన్నత్యాన్ని కొనియాడారు.
నీరు లేని ఎడారి యైనను.. వాన వరదల వసతి యైనను.. అగ్గి కొండల కవనియైనను మాతృదేశము మాతృదేశమె..,
తల్లి కోపము.. తండ్రి శాపము, భార్య బిడ్డల ప్రణయ పాశము ఇంచుకయు గణియింపనీయదు.. మాతృదేశము.. మాతృదేశమె..అంటూ పద్మవిభూషణుడు కాళోజీ నారాయణరావు మాతృభూమి గొప్పదనాన్ని చాటిచెప్పారు.
‘ శ్రీలుపొంగిన జీవగడ్డయి.. పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరతఖండము’ అన్న రాయప్రోలు, ‘సకల సంపత్సమేత మా భరత మాత’ అన్న జాషువా వంటి మహానుభావులు ఎందరో స్వాతంత్య్ర పోరాట దీప్తి శిఖలు రగిలించారు.
ఇవాళ మాతృభూమి అణువణువునా త్రివర్ణ పతాక రెపరెపల్లో భారతీయుల తేజస్సు విరాజిల్లుతున్నది. అనేక త్యాగాలతో, పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి, స్వయంపాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారతావని నేడు వజ్రోత్సవాలను జరుపుకొంటున్నది. 1857లో ఉజ్వలమైన సిపాయిల తిరుగుబాటుకు ముందునుంచే బ్రిటిష్ వాళ్లపై మొదలైన పోరాటం.. ఆసేతుహిమాచలం ఒక్కటై నిరంతరంగా కొనసాగించింది. విప్లవ, రాజకీయ, సాంస్కృతిక రూపాల్లో జరిగిన పోరాటాల ఫలితంగా, ఎంతోమంది ఎన్నోరకాల త్యాగాల ఫలంగా దేశం విముక్తమైంది.
ఆ తరువాత ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ.. అడ్డంకులను తొలిగించుకొంటూ.. ఒక్కో రంగంలో పురోగమిస్తూ.. నేడు మన కండ్ల ముందున్న భారతం ఆవిష్కారమైంది. ఏ దేశానికైనా స్వేచ్ఛా స్వాతంత్య్రం ఒక అపూర్వ సందర్భం. ఇవాళ మనం కండ్లారా చూస్తున్న ఈ దేశాన్ని సాధించడానికి ఎందరో పెద్దలు ఎంత ప్రయాస పడ్డారో దాన్ని కాపాడుకోవడానికి వజ్ర సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన తరుణం ఈ వజ్రోత్సవం.
దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాచుకొన్న ప్రతీపశక్తులను తెగనాడి.. విస్తృతమైన దేశీయ భావనలతో అన్నార్తులు, దీనార్తులు లేని భారతం కోసం కంకణ ధారులం కావాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్ప దీక్ష ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తున్న సందర్భమిది. యావత్ ప్రపంచం మనల్ని చూసి నేర్చుకొనేలా మహత్తరమైన దేశ నిర్మాణం చేయడానికి మనమంతా పునరంకితం కావాల్సిన సమయమిది.
ఏ దేశానికైనా స్వేచ్ఛా స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భం. భారతజాతి తన స్వాతంత్య్రం కోసం ఒకటిన్నర శతాబ్దం పాటు పోరాటం చేసింది. సముజ్వలమైన పోరాట ఫలితంగా సాధించిన స్వతంత్ర భారతంలో అన్నార్తులు, అనాథలు లేని దేశం కోసం జాతిపిత చూపించిన దారిలో పునరంకితం కావాలి. ఈ వజ్రోత్సవ దీప్తిలో కంకణ ధారులం కావాలి. ప్రతి భారతీయుడు ఈ దేశం నాది. ఇందులో నేను వాటాదారుణ్ణి అని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితులు సృష్టించాలి.
– సీఎం కేసీఆర్
లక్ష్యాలు, ఆలోచనలు, విలువలు మరచిపోయేవారు మాత్రమే అపజయం పాలవుతారు. ఎదురుదెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి ఆ తరువాత గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు లేచి సంబాళించుకోవడం కూడా కష్టమవుతుంది. ఎంత గొప్పవారినైనా విమర్శించడం చాలా సులువు. కానీ ఒళ్లు వంచి ఏ చిన్న పనిని అయినా చేయడమే కష్టం. పనిని అభిమానించడం మొదలు పెడితే విజయం దానంతట అదే వస్తుంది.
– చాచా జవహర్లాల్ నెహ్రూ
ఇతరుల మెదళ్లను పనిచేయించగలవాడే మేధావి. పోరాటం చేయకపోయినా.. సాహసం చేయలేక పోయినా.. లక్ష్యంపై సగం ఆసక్తి కోల్పోతాం. మనం ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి. అన్యాయంతో రాజీ పడటం అంటే.. మనం అతి పెద్ద నేరం చేసినట్టే. రాజకీయ బేరసారాల రహస్యమేమిటంటే.. మీరు నిజంగా ఉన్నదానికంటే బలంగా కనిపించడం.
– నేతాజీ సుభాష్ చంద్రబోస్
ఏ దేశంలోనైనా స్వాతంత్య్రం సాధించినదీ, నిలబెట్టినదీ.. ఆ దేశపు యువ కిశోరాలే. వందల ఏండ్ల కిందట ఐకమత్యం లేకపోవడంతో భారత్ స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. భారత ప్రజలు మళ్లీ అలాంటి తప్పు చేయకూడదు
– సర్దార్ వల్లభ్భాయ్ పటేల్
రాజకీయంగా భారత్ స్వతంత్ర దేశమైనంత మాత్రాన చాలదు.. దేశంలో ప్రతి ఒక్క పౌరుడికీ మతపరమైన, రాజకీయపరమైన హక్కులు అందాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పుడే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు పొందగలుగుతారు.
– డాక్టర్ బీఆర్ అంబేద్కర్