సిటీబ్యూరో, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ) : నేడు ఆరోగ్యంపై మనం తీసుకునే జాగ్రత్తలే రాబోయే రోజుల్లో మనం సంతోషంగా జీవించేందుకు అవకాశం ఉంటుందని, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పరిపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే కొన్ని నియమాలను తప్పక అనుసరించాలని వారు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
నేడు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. దీంతో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఆరోగ్యానికి ఈ ఐదింటిని అనుసరించాలి..
కనీస జాగ్రత్తలు తప్పనిసరి..
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కనీస జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామంతోపాటు తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంతో గతంలో పాటించిన జాగ్రత్తలను పాటించడం మంచిది.
– డాక్టర్ ఆరతి బళ్లారి,కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్
కేర్ హాస్పిటల్లో హెల్త్ ఫర్ ఆల్
బంజారాహిల్స్,ఏప్రిల్ 6 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నం 10లోని కేర్ అవుట్ పేషెంట్ విభాగంలో ‘హెల్త్ ఫర్ ఆల్ ’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఏటికూరి కృష్ణమూర్తి(102)ను ఘనంగా సత్కరించారు. అందరికి ఆరోగ్యం పేరుతో ఈ ఏడాది ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్వో) సూచనల మేరకు 102 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉన్న కృష్ణమూర్తిని సత్కరిస్తున్నామని హాస్పిటల్ సీవోవో నీలేశ్ గుప్త తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.అజిత్సింగ్, రూపుస్ అగస్టీన్, సద్దాం పాల్గొన్నారు.