హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఏడున నిర్వహించిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష కీ పేపర్పై అభ్యంతరాల స్వీకరణ గడువు సోమవారంతో ముగియనున్నది. సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఎవరైనా వెబ్సైట్లో తమ ఫిర్యాదులు నమోదు చేయొచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
పరీక్ష అయ్యాక కొన్ని ప్రశ్నలను తొలగించి అభ్యర్థులందరికీ సమానంగా వాటికి మార్కులు వేయడం, ఒకే జవాబు ఉన్న మల్టీపుల్ ప్రశ్నలకు మార్కులు కేటాయించడం అనేది దేశంలో ప్రతి రిక్రూట్మెంట్ బోర్డు చేస్తున్నదేనని వెల్లడించింది. 2018-19 ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో 11 ప్రశ్నలు, అదే ఏడాది పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో 9 ప్రశ్నలకు అభ్యర్థులందరికీ సమానంగా మార్కు లు వేసిన విషయాన్ని గుర్తుచేసింది.
నిపుణులు సూచించిన ప్రశ్నల నుంచి అత్యంత గోప్యంగా ప్రశ్నపత్రాలను రూపొందించే క్రమంలో, వాక్య నిర్మాణపరంగా ఉన్న గందరగోళ ప్రకటనలు, అనువాద లోపాలతో ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయని వివరించింది. టీఎస్ఎల్పీఆర్బీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నదని తెలిపింది.
అభ్యర్థులకు అవసరమయ్యే ప్రతి సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఈ-మెయిల్స్, మెసేజ్ల రూపంలో లేదా పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని చైర్మన్ వీవీ శ్రీనివాస్రావు తెలిపారు. ఈ విషయంలో మీడియా/సోషల్ మీడియాలో కొందరు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.