Sunday Funday | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్పై ఆదివారం సన్డే ఫన్డేను సరికొత్తగా నిర్వహించనున్నారు. చాలా రోజుల తర్వాత నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. హుస్సేన్సాగర్ నీటిలో కొత్తగా మ్యూజికల్ ఫౌంటెయిన్ను ఏర్పాటు చేశామని, రాత్రి 7,8,9,10 గంటల సమయంలో ప్రతి గంటకోసారి 15 నిమిషాల పాటు 5-6 మ్యూజిక్ ట్యూన్లతో మ్యూజికల్ ఫౌంటెయిన్లు అలరించేలా ఈ సారి సన్డే ఫన్డే ఉంటుందని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్కు వాహనాలను వెళ్లకుండా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ పైకి వాహనాలకు అనుమతి లేదు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్పైకి వాహనాలకు ఎంట్రీ లేదు. ఈ రూట్లో వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు మళ్లించనున్నారు. కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ ఆలయం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే వాహనాలను ఓల్డ్ సచివాలయం వద్ద తెలుగుతల్లి ఫై ఓవర్ పైకి మళ్లిస్తారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆదర్శ్ నగర్ వరకు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్ట్రన్స్ పార్క్ వరకు, బుద్ద భవన్ వెనుక నుంచి నెక్లెస్ రోడ్డు వరకు, ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.