తెలుగుయూనివర్సిటీ, జనవరి 30: సిరాజ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు హాలులో మేరా భారత్ మహాన్ శీర్షికన నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులలో దేశభక్తిని పెంపొందించింది. సిరాజ్ మాస్టర్ సారథ్యంలో 73 మంది ఔత్సాహిక గాయనీ గాయకులు 73 నిమిషాలలో దేశభక్తి గీతాలను ఆలపించడంతో తెలంగాణ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సమన్వయకర్తలు కె.వి. రమణారావు, బి.అమ్ములు పాల్గొని తెలంగాణ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశంసాపత్రాన్ని సిరాజ్ డ్యాన్స్ అకాడమీ సిరాజ్ మాస్టార్కు అందజేశారు. నటీనటులు వేణు, శ్రావణ్, ప్రియాన్ష దూబే, డాక్టర్ వంశీ ప్రతాప్ గౌడ్, జీవన్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొని గాయనీ గాయకులను సత్కరించారు. దేశ ప్రజలకు స్వేచ్చను అందించేందుకు జీవితాలను త్యాగం చేసిన మహానీయులను ఎప్పటికీ మరవద్దని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.