నిలోఫర్ దవాఖానకు ఎన్ఆర్ఐ చేయూత
సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ):నిరుపేద రోగులు చికిత్స పొందే నిలోఫర్ వంటి దవాఖానలకు సేవ చేయడం భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని ఎన్ఆర్ఐ ప్రదీప్ భాష్యం అన్నారు. గురువారం దవాఖానలో రూ.కోటి విలువతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ సెంటర్, ఏసీలను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, సీఎస్ ఆర్ఎంఓ జ్యోతి, ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్బాబు దాంపురిలతో కలిసి ప్రదీప్ భాష్యం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో నుంచి కొంత పేద ప్రజలకు దానం చేసినప్పుడు కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ నిరుపేద రోగులు చికిత్స పొందే నిలోఫర్ హాస్పిటల్కు సహాయం చేసేందుకు ఎన్ఆర్ఐ ప్రదీప్ భాష్యం స్వయంగా ముందుకు రావడం సంతోషకరమన్నారు.
ఎన్ఆర్ఐ ప్రదీప్ అందచేసిన 288 సీసీ కెమెరాలను స్థానిక నాంపల్లి పోలీసుల సహకారంతో ఐసీయూ బ్లాక్, ఇన్ఫోసిస్, ఏఆర్టీ బ్లాక్లలో ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలన్నింటిని అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాలు దవాఖానకు వచ్చిపోయే ప్రతి ఒక్కరిపై నిఘా పెడతాయని, వీటిని 24/7 పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాత ప్రదీప్ బంధువులు జగదీశ్, సురేశ్, విజయలక్ష్మితో పాటు నాంపల్లి ఏసీపీ సంజీవ్కుమార్, సీఐ అభిలాష్, నిలోఫర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ వేణు, టెక్నికల్ అసిస్టెంట్ షమ్మీ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ దవాఖానకు అమెరికా వైద్యుడి విరాళం
బన్సీలాల్పేట్, జనవరి 18 : గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అమెరికా అధ్యక్షుడు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుడు, డాక్టర్ దివేశ్ అనిరెడ్డి, గాంధీ దవాఖానలోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హెచ్ఓడీ, డాక్టర్ పి.శ్రావణ్కుమార్ ఆయనను సన్మానించారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు మాట్లాడుతూ తాను చదువుకున్న కాలేజీ, దవాఖానకు విలువైన సామగ్రిని అందజేసిన దివేశ్ అనిరెడ్డి ఎందరో పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రొఫెసర్ పి.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ గతంలో కూడా పలుమార్లు ఇండియా వచ్చే సమయంలో తనకు ఫోన్ చేసి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి అవసరమైన సామగ్రి గురించి అడిగేవారని, అమెరికాలో కొనుగోలు చేసి విమానంలో ఎంతో బరువైన, విలువైన సామాగ్రిని ఎయిర్పోర్టులో కస్టమ్స్ సుంకం చెల్లించి, గాంధీ దవాఖానకు వచ్చి ఇవ్వడం ఎంతో అభినందనీయమని అన్నారు.
దివేశ్ అనిరెడ్డి మాట్లాడుతూ తాను అమెరికా వెళ్లిన తర్వాత సేవాభావం కలిగిన మిత్రులతో కలిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, నైపుణ్య శిక్షణ రంగాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగుపర్చాల్సిన విద్యా వ్యవస్థపై తమ సంస్థ చేసిన పరిశోధన వివరాలను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి అందజేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ జయకృష్ణ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఇండియా అధ్యక్షుడు ఎం.రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినీల్, పలువురు పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.