హైదరాబాద్: హైదరాబాద్ మలక్పేట (Malakpet) రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. మలక్పేట రైల్వే స్టేషన్ (Railway station) సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు (MMTS trains) ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు రెండు రైళ్లను ఆపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
దాదాపు అరగంట పాటు రెండు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపివేశారు. అనంతరం రూట్ క్లియర్ చేసి ఓ రైలును మరో ట్రాక్ పైకి మళ్లించారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రెండు రైళ్లు ఒకే లైన్లోకి ఎలా వచ్చాయి, లోపం ఎక్కడ జరిగిందనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.