చిక్కడపల్లి,అక్టోబర్ 25: గచ్చిబౌలి ఇండ్ల స్థలాల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనున్నదని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటేడ్ సర్వసభ్య సమావేశం సోమవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ సొసైటీలో మొత్తం 3వేల మంది సభ్యులు ఉన్నారని, 2005లో సొసైటీకి 189 ఎకరాలు గత ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల విభజన అనంతరం ఇండ్ల స్థలాల ప్రక్రియ ఆలస్యమైందన్నారు. సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, సొసైటీ కార్యదర్శి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు అబ్దుల్ సాధిక్, సంధ్యారాణి, శ్రీనివాస్, కేశ్యనాయక్, మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు.