Hyderabad | సిటీబ్యూరో/ఉప్పల్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ):మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఆదివారం ఉప్పల్లో ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్లో జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 1500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం 7 అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. మరో వైపు నగరం నలువైపుల నుంచి వచ్చే ప్రేక్షకుల కోసం ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను గ్రేటర్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. రద్దీకనుగుణంగా ప్రతి 5, 3, 2 నిమిషాలకు ఒకటి చొప్పున అదనంగా మెట్రో రైళ్లను కూడా నడిపించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే ఉప్పల్ మైదానంలో బందోబస్తు ఏర్పాట్లను శనివారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పర్యవేక్షించారు.
ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధం చేశారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో హైదరాబాద్లో మొదటి మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాచకొండ సీపీ డీఎస్.చౌహన్ శనివారం వివరాలు వెల్లడించారు. ఈ ఐపీఎల్ మ్యాచ్కు భద్రత ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం 1500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నిర్దేశించిన పార్కింగ్ స్థలాలు, పోలీసులు సూచించిన ప్రవేశమార్గం, బయటికి వెళ్లే మార్గాల్లోనే ప్రేక్షకులు వెళ్లాలన్నారు. బ్లాక్లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేడియం పరిసర ప్రాంతాలు పూర్తిస్థాయిలో 340 సీసీ కెమరాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. స్టేడియంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. మహిళల ఈవ్ టీజింగ్ నియంత్రణకు ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర వైద్యసేవల కోసం 7 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచామన్నారు.
ల్యాప్టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమరాలు, సిగరేట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పదునైన మెటల్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, హెల్మెట్లు, బ్యాగులు, తదితర వస్తువులు స్టేడియంలోకి అనుమతించరు.
ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్-రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరుగనున్నాయి. మ్యాచ్కు సంబంధించిన భద్రత ఏర్పాట్లు హెచ్సీఏ పర్యవేక్షిస్తున్నది. కాగా, ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ నేపథ్యంలో స్టేడియాన్ని విభిన్న రంగులతో ముస్తాబు చేశారు.
ఇష్టమైన క్రికెటర్ల ప్లకార్డులు, విభిన్న రకాల వేషధారణ, చీర్ గర్ల్స్ స్టెప్పులు, తదితర దృష్యాలన్నీ స్టేడియంలో ఆవిష్కృతం కానున్నాయి. టికెట్స్ బుక్ చేసుకోవడంలో అభిమానులు బిజీగా ఉన్నారు. రూ.800 నుంచి టికెట్ ధరలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి మ్యాచ్ జరిగే 72 గంటల ముందర టికెట్ హార్డ్ కాపీ పంపిస్తున్నారని క్రికెట్ అభిమాని శరత్ చెప్పాడు.