ముషీరాబాద్, జనవరి 24: త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు సంగీత ప్రపంచంలో అరుదైనవిగా గుర్తింపు పొందాయని, శాస్త్రీయ సంగీతానికి గొప్ప ప్రతిష్టను తీసుకువచ్చాయని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో మంగళవాద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక సంగీత విద్వాంసులతో ఆద్యుడుగా ప్రసిద్ధుడైన త్యాగరాజస్వామి కీర్తలనలు మహోన్నతమైనవని, నాదస్వర కళాకారులు త్యాగయ్య కీర్తలను నేటి తరాలకు తెలియచేసే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసమే బీసీ కమిషన్ ఏర్పడిందని, నాదస్వర వాయిద్య కుల వృత్తులపై ఆధారపడుతున్న వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ కార్పొరేటర్ రవిచారి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ట్రస్ట్ చైర్మన్ పి.శ్రీనివాస్, కె నరసింహారావు, ఐ శ్రీనివాస్, రవిశంకర్, ఎస్ నారాయణ, మల్లికార్జున్, సతీశ్, ఆదినారాయణ, ఆత్మకూరి నారాయణ, ధన్రాజ్, చెన్నారావు, బాలరాజ్ గౌడ్, బాలకృష్ణ, వికాస్ తదితరులు పాల్గొన్నారు.